పామాయిల్ తోట దగ్ధం
ABN , First Publish Date - 2022-05-24T06:54:55+05:30 IST
ఎండిన వరి మొదళ్లకు నిప్పు పెట్టడంతో పక్కనే ఉన్న పామాయిల్, అడవిలో ఉన్న చెట్లు అగ్గికి ఆహుతయ్యాయి. ఈ
మోతె, మే 23: ఎండిన వరి మొదళ్లకు నిప్పు పెట్టడంతో పక్కనే ఉన్న పామాయిల్, అడవిలో ఉన్న చెట్లు అగ్గికి ఆహుతయ్యాయి. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా మోతె మండల పరిధిలోని రాఘవాపురం క్రాస్రోడ్ వద్ద సోమవారం చోటుచేసుకుంది. బాధిత రైతులు ఫైరింజన్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం... రాఘవాపురం, భీక్యాతండా సమీపంలో మద్ది సంజీవరెడ్డికి చెందిన ఆరు ఎకరాల్లో 320పామాయిల్ చెట్లు ఉన్నాయి. పక్కనే దుశర్ల సత్యనారాయణ అడవిలో పెద్ద చెట్లు, మద్ది వెంకట్రెడ్డికి చెందిన మోపులు కట్టని మూడు ఎకరాలు గడ్డి అగ్నికి ఆహుతయ్యాయి. సమీపంలో ఉన్న రైతులు ఎండిన వరి మొదళ్లకు నిప్పుపెట్టి ఇంటికి వెళ్లడంతో సాయంత్రం వీచిన ఈదురు గాలులకు పక్కన ఉన్న వీటికి అంటుకున్నాయి. ఫైరింజన్ వచ్చే సమయానికే పూర్తిగా అగ్గికి ఆహుతైనవి. పామాయిల్ తోటకు రూ.2లక్షల మేర ఆస్తినష్టం జరగింది. రూ.30వేల విలువైన గడ్డి కాలిపోయింది.
నిమ్మతోట దగ్ధం.. రూ.40 వేలు నష్టం
నడిగూడెం: వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో నిమ్మతోట దగ్ధమైంది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కరివిరాలలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన మొగిలి సాహెబ్కు చెందిన భూమిలో 75నిమ్మచెట్లు ఉండగా పక్కనే ఉన్న రైతు తన వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో దాదాపు 30కిపైగా కాలిపోయాయి. రూ.40 వేల ఆస్తినష్టం జరిగిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.