పార్టీ మారతానని దురష్ప్రచారం

ABN , First Publish Date - 2020-06-01T10:29:03+05:30 IST

‘నేను ఏ పార్టీలో ఉన్నానో అదే పార్టీలో..

పార్టీ మారతానని దురష్ప్రచారం

పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి 


మార్టూరు(ప్రకాశం): ‘నేను ఏ పార్టీలో ఉన్నానో అదే పార్టీలో కొనసాగుతున్నాను. కొంతమంది అత్యుత్సాహంతో నేను పార్టీ మారుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. సంబంధం లేని అంశాలపై వస్తున్న వార్తలను ఖండించనవసరం లేదని అనుకున్నాను, నా నిబద్ధతను ప్రశ్నిస్తూ క్యారెక్టర్‌ను దెబ్బతీసే విధంగా ప్రచారం చేస్తుండడంతోనే నా వైఖరిని స్పష్టం చేస్తున్నా’ అని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. టీడీపీకి ఏలూరి గుడ్‌బై చెప్పబోతున్నారని జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు.  మండలంలోని ఇసుక దర్శి వద్ద ఉన్న తన  కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు.


పర్చూరు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా వివాదాలకు దూరంగా, అందరినీ కలుపుకొని నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, ఇక్కడ టీడీపీకి చెందిన తాను గెలవటంతో సహజంగా ఇరు పార్టీల మధ్య నెలకొనే ఉద్రిక్త వాతావరణం ఉండకూడదన్న ఉద్దేశంతో నేను రాజకీయంగా ఏడాది నుంచి వేగం తగ్గించానని చెప్పారు. ఈ విషయాన్ని అర్ధం చేసుకోకుండా కొంతమంది దుష్ప్రచారం ప్రారంభించారన్నారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలతో, రాజకీయాలకు అతీతంగా నాయకులతో తనకు మంచి సంబంధాలున్నాయని అన్నారు.


ప్రజలు నన్ను కుటుంబసభ్యుడిగానే చూస్తున్నారని చెప్పారు. తన రాజకీయ జీవితంలో 8 సంవత్సరాలు తనతోపాటు ప్రయాణించిన నాయకులు, కార్యకర్తలు, ప్రజానీకంతో సంప్రదించకుండా ఇతర పార్టీకి చెందిన వ్యక్తులను కలవటం గానీ, వారితో చర్చించడంగానీ చేస్తానని అనుకోవడమే అవివేకమన్నారు. తాను ఇతర పార్టీల నేతలను కలిసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్‌ విసిరారు. టీడీపీ అధినేత, ముఖ్య నాయకులకు అందుబాటులో ఉన్నానని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో కూడా నిత్యం ముఖ్యనాయకులందరికీ ఏదో రూపంలో టచ్‌లోనే ఉన్నానన్నారు. కరోనా సమస్య వచ్చిన తర్వాత పేదలకు అవసరమైన సహాయక చర్యలను ప్రత్యక్షంగానే కాక, పరోక్షంగా జరిగేలా పర్యవేక్షించిన విషయాన్ని గుర్తు చేశారు. 


మీకు చెప్పకుండా ఏదీ చేయను

‘మీ కష్టం, ప్రజల ఆశీస్సులతో రెండోసారి పర్చూరు శాసనసభ్యుడిగా విజయం సాధించాను. మీకు చెప్పకుండా, మిమ్మల్ని సంప్రదించకుండా పార్టీ మారతానని ఎలా నమ్మారు’ అని ఎమ్మెల్యే ఏలూరి సాంబ శివరావు అన్నారు. పార్టీ కార్యాలయానికి వచ్చిన నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, అధైర్య పడవద్దని, మనం తెలుగుదేశంలోనే ఉన్నాం.. అదే పార్టీలో కొనసాగుతామని చెప్పటంతో నాయకులు, కార్యకర్తలు ఆనందంతో చప్పట్లు కొట్టారు.


ఎమ్మెల్యే ఏలూరి పర్యటన 

పర్చూరు: ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పలు గ్రామాల్లో ఆదివారం పర్యటించారు. పర్చూరు మండలంలోని కొల్లావారిపాలెంలో ఆయన ప్రజలతో కొంత సేపు ముచ్చటించారు. అనంతరం గ్రామంలోని మంచినీటి చెరువును పరిశీలించారు. ఇటీవల మృతి చెందిన ఏసుబాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. యద్దనపూడిలోని ప్రధానకూడలిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే ఏలూరి కారం చేడు వెళ్లారు.  

Updated Date - 2020-06-01T10:29:03+05:30 IST