పాలమూరు, డిండి ప్రాజెక్టులకు నిధుల వరద

ABN , First Publish Date - 2021-01-24T08:11:23+05:30 IST

వలసల జిల్లాగా పేరొందిన ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు, కరువుకు నెలవైన రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందించే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని సీఎం

పాలమూరు, డిండి ప్రాజెక్టులకు నిధుల వరద

ఏడాది చివరికల్లా ‘పాలమూరు’ పూర్తవ్వాలి

ఆరు నెలల్లోగా డిండిని పూర్తి చేయండి

రూ.2,000 కోట్లు విడుదల చేయండి

రాష్ట్రమంతా భగీరథ నీళ్లే తాగాలి 

ఈ నీటిలో తగిన పాళ్లలో ఖనిజాలు ఉన్నాయి

లష్కర్లుగా గ్రామ సహాయకులు

సాగు శాఖలోకి వీఆర్‌ఏలు: సీఎం కేసీఆర్‌


హైదరాబాద్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): వలసల జిల్లాగా పేరొందిన ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు, కరువుకు నెలవైన రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందించే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని సీఎం కె.చంద్రశేఖరరావు ఆదేశించారు. ఫ్లోరైడ్‌, వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నల్లగొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు సాగునీరు అందించే డిండి ప్రాజెక్టు పనుల వేగాన్ని పెంచి, ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని సూచించారు. ఈ రెండు ప్రాజెక్టులకు నిధుల వరద ఆగవద్దని, ఈ ఏడాది బడ్జెట్లో కూడా నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. అత్యవసరమైన, తక్కువ వ్యయంతో కూడిన పనుల కోసం హైదరాబాద్‌ దాకా రావాల్సిన అవసరం లేకుండా, వివిధ స్థాయుల్లో అధికారులే మంజూరు చేసి, పనులు నిర్వహించే అధికారం ఇచ్చేలా చారిత్రక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.


మస్కూరీ(నీరడి)లను నీటి పారుదల శాఖలో విలీనం చేసి.. లష్కర్లుగా వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు, వారికి తగిన శిక్షణ ఇచ్చి, ప్రాజెక్టుల నిర్వహణలో ఉపయోగించుకోనున్న ట్లు సీఎం వెల్లడించారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం కేసీఆర్‌ శనివారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. మంత్రి జగదీశ్‌ రెడ్డి, టిఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, సురేందర్‌, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్‌ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. 


మహబూబ్‌నగర్‌ సస్యశ్యామలం

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఉన్న నార్లాపూర్‌ రిజర్వాయర్‌, పంపుహౌస్‌, నార్లాపూర్‌-ఏదుల కాలువ, ఏదుల పంపుహౌస్‌, ఏదుల-వట్టెం కాలు వ, వట్టెం రిజర్వాయర్‌, వట్టెం-కరివెన కాలువ, కరివెన రిజర్వాయర్‌, కరివెన-ఉద్దండాపూర్‌ కాలువ, టన్నెల్‌ పనుల్లో పురోగతిని సీఎం సమీక్షించారు. ఉద్దండాపూర్‌ నుంచి ఎగువ ప్రాంతాలకు నీరందించే మార్గానికి సంబంధించి తుది డిజైన్లను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కల్వకుర్తి, భీమా, కోయిల్‌సాగర్‌, నెట్టెంపాడు ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 10 లక్షల ఎకరాల కు, జూరాలతో కలిపి 11.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం వెల్లడించారు. పాలమూరు ప్రా జెక్టు పూర్తయితే మహబూబ్‌నగర్‌ జిల్లా సస్యశ్యామ లం అవుతుందని అన్నారు.  


1.10 కోట్ల ఎకరాల్లో వరి సాగు

‘‘తెలంగాణ ఆవిర్భావ సమయానికి 30 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగయ్యేది. ఇప్పుడు 1.10 కోట్ల ఎకరాల్లో వరి పండుతోంది. సాగునీటి వసతి పెరగడం వల్లే ఇది సాధ్యమైంది. 1.25 కోట్ల ఎకరాలకు ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని అందించే వ్యవస్థ సిద్ధమవుతోంది. బోర్ల ద్వారా సాగయ్యే భూమికి ఇది అదనం.  సాగునీటి వ్యవస్థను సమరంగా నిర్వహించడానికి నీటి పారుదల శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఆయా ప్రాదేశిక ప్రాంతాల్లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు, చెరువులు, తూములు, చెక్‌డ్యాములు, ఆనకట్టలు, ఎత్తిపోతల పథకాలు.. అన్నీ ఒకే సీఈ కిందకు తీసుకొచ్చాం. డీఈఈ స్థాయి నుంచి ఇంజనీర్‌-ఇన్‌-చీఫ్‌ స్థాయి వరకు ప్రతి అధికారికి నిర్ధిష్టమైన ఆర్థిక అధికారాలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇది చరిత్రాత్మక నిర్ణయం. దేశంలో మరెక్కడా ఈ విధానం లేదు’’ అని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.


పునర్వ్యవస్థీకరణపై ఫీడ్‌బ్యాక్‌ తీసుకోండి

నీటిపారుదల శాఖను ప్రభుత్వం ఇటీవల పునర్వ్యవస్థీకరించింది. ఈ విభజన, ఆయా అధికారులకు నిర్ణయించిన పరిధి సౌకర్యవంతంగా, పనులు చేయడానికి అనువుగా ఉందా? లేదా? అనే విషయంలో ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలి. అవసరమైన పక్షంలో మార్పులు చేయా లి’’ అని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.


2 వేల కోట్లు ఇవ్వండి

  • పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పనులకు బిల్లులు చెల్లించడానికి తక్షణం రూ.2000 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు.
  • ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణను పూర్తి చేయడానికి తక్షణం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని నాగర్‌కర్నూల్‌, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. 
  • బీహెచ్‌ఈఎల్‌ అధికారులతో సమావేశమై అవసరమైన మోటార్లను వెంటనే తెప్పించి, బిగించే పనులను పర్యవేక్షించాలని నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు.
  • మిషన్‌ భగీరథకు నీరివ్వాడానికి వీలుగా అన్ని రిజర్వాయర్లలో మినిమం డ్యామ్‌ డ్రాయింగ్‌ లెవల్‌ ఉండేలా చూడాలని ఆదేశించారు.

Updated Date - 2021-01-24T08:11:23+05:30 IST