మొదలు పెట్టకుండానే ముగించారు.. టాస్‌కు ముందు న్యూజిలాండ్-పాక్ సిరీస్ మొత్తం రద్దు!

ABN , First Publish Date - 2021-09-17T21:20:38+05:30 IST

పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య నేటి నుంచి ప్రారంభం కావాల్సిన మూడు వన్డేల సిరీస్‌కు ఆదిలోనే అడ్డంకి

మొదలు పెట్టకుండానే ముగించారు.. టాస్‌కు ముందు న్యూజిలాండ్-పాక్ సిరీస్ మొత్తం రద్దు!

రావల్పిండి: పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య నేటి నుంచి ప్రారంభం కావాల్సిన మూడు వన్డేల సిరీస్‌కు ఆదిలోనే అడ్డంకి ఎదురైంది. రావల్పిండి స్టేడియంలో నేడు తొలి వన్డే జరగాల్సి ఉండగా టాస్‌కు కొన్ని నిమిషాల ముందు సిరీస్‌ మొత్తం రద్దైంది. భద్రతా పరమైన కారణాల వల్లే మ్యాచ్ రద్దయినట్టు తెలుస్తోంది. ఆటగాళ్లు హోటల్ గదులకే పరిమితం కావాలని, మైదానంలోకి రావద్దన్న న్యూజిలాండ్ భద్రతా సలహాదారుల సూచనతో ఆటగాళ్లు హోటల్ గదుల్లోనే ఉండిపోయారు. 


నేటి నుంచి అక్టోబరు 3వ తేదీ వరకు మూడు వన్డేలు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు పాక్ ఆతిథ్యమిస్తోంది. కివీస్ జట్టు 18 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టడంతో దీనిని రికార్డు సిరీస్‌గా భావించారు. అయితే, న్యూజిలాండ్ ప్రభుత్వం నుంచి ఆ జట్టు సెక్యూరిటీ సిబ్బందికి అందిన ఆదేశాల నేపథ్యంలో సిరీస్‌ను రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. పర్యటన మొత్తాన్ని రద్దు చేసుకున్న న్యూజిలాండ్ స్వదేశం వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. 

Updated Date - 2021-09-17T21:20:38+05:30 IST