నా బౌలింగ్‌ చూసి కోహ్లీ షాక్ అయ్యాడట: పాక్ పేసర్ ఇర్ఫాన్

ABN , First Publish Date - 2020-08-13T22:24:12+05:30 IST

భారత ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ తన బౌలింగ్‌పై చేసిన కామెంట్స్ ఇప్పటికి మరువలేనని పాకీస్తాన్ పేసర్ మహమ్మద్ ఇర్ఫాన్ అన్నాడు. తాను..

నా బౌలింగ్‌ చూసి కోహ్లీ షాక్ అయ్యాడట: పాక్ పేసర్ ఇర్ఫాన్

ఇస్లామాబాద్: భారత ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ తన బౌలింగ్‌పై చేసిన కామెంట్స్ ఇప్పటికి మరువలేనని పాకీస్తాన్ పేసర్ మహమ్మద్ ఇర్ఫాన్ అన్నాడు. తాను 150కీమీల వేగంతో బౌలింగ్ చేస్తానని కోహ్లీ తొలుత నమ్మలేదని, కానీ తొలి బంతినే 145-146కీమీల వేగంతో విసిరేసరికి ఆశ్చర్యపోయాడని ఇర్ఫాన్ చెప్పాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇర్ఫాన్ తన తొలి భారత క్రికెట్ టూర్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ‘పాక్‌ జాతీయ జట్టుకు ఎంపికైన తరువాత భారత టూర్‌కు 2012లో తొలిసారి వెళ్ళాను. అయితే నేను కేవలం మీడియం పేస్ మాత్రమే వేస్తానని భారత ఆటగాళ్లకు వారి కోచ్ చెప్పారట. నా బౌలింగ్ 130-135కీమీల వేగం దాటదని, ఎత్తుగా ఉండటం వల్ల బౌన్సర్లు మాత్రమే వేయగలుగుతానని చెప్పారట. ఈ విషయాన్ని కోహ్లీనే స్వయంగా నాకు తెలిపాడు. కోహ్లీ డగౌట్‌లో కూర్చొని ఉన్నప్పుడు నా బౌలింగ్ చూశాడట. తొలి బంతి 145-146కీమీలు, రెండో బంతి 147కీమీలు, మూడో బంతి 148కీమీల వేగంతో వేయడంతో తాను షాక్ అయ్యానని కోహ్లీ నాతో అన్నాడు. అంతేకాకుండా నేను మీడియం పేస్‌లోనే బౌలింగ్ చేస్తానని చెప్పిన వ్యక్తిపై కూడా అరిచేశానని కోహ్లీ చెప్పాడు. కోహ్లీ ఆ మాట చెప్పడంతో నేనెంతో సంతోషించాన’ని ఇర్ఫాన్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే ఇర్ఫాన్ పాక్ జట్టుకు ఎంపికైన తొలినాళ్ళలో 130-135కీమీల వేగంతోనే బౌలింగ్ చేసేవాడు. దీంతో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలిసిరీస్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో జట్టులో స్థానం కూడా కోల్పోయాడు. అనంతరం పట్టుదలతో ఎంతో కష్టపడి తన బౌలింగ్ వేగాన్ని పెంచుకున్నాడు. నిలకడగా ప్రతి బంతినీ 140-150కీమీల వేగంతో వేయగలిగేలా సన్నద్ధమయ్యాడు.

Updated Date - 2020-08-13T22:24:12+05:30 IST