‘పాకిస్థాన్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టడానికి ఆ దేశ మంత్రి వ్యాఖ్యలే ఆధారం’

ABN , First Publish Date - 2020-10-30T18:30:37+05:30 IST

పాకిస్థాన్ మంత్రి ఫవద్ చౌదరి వ్యాఖ్యల ఆధారంగా ఆ దేశాన్ని ఎఫ్ఏటీఎఫ్ బ్లాక్‌లిస్ట్‌లో

‘పాకిస్థాన్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టడానికి ఆ దేశ మంత్రి వ్యాఖ్యలే ఆధారం’

న్యూఢిల్లీ : పాకిస్థాన్ మంత్రి ఫవద్ చౌదరి వ్యాఖ్యల ఆధారంగా ఆ దేశాన్ని ఎఫ్ఏటీఎఫ్ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టించేందుకు ప్రయత్నించాలని భారత ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి వీకే సింగ్ కోరారు. జమ్మూ-కశ్మీరులోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడిలో పాక్ ప్రభుత్వ ప్రమేయం ఉన్నట్లు చెప్పిన ఫవద్ భారత దేశ వైఖరిని సమర్థించారని తెలిపారు. 


2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ వాహనంపై జరిగిన ఉగ్రవాద దాడిలో 40 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే, పాకిస్థాన్ ఫెడరల్ మంత్రి ఫవద్ చౌదరి నేషనల్ అసెంబ్లీలో మాట్లాడుతూ, పుల్వామా దాడి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ ప్రభుత్వ విజయమని తెలిపారు. ఇంట్లోకి దూరి దెబ్బతీశామన్నారు. పుల్వామాలో సాధించిన విజయం ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని యావత్తు సమాజం సాధించిన గెలుపు అని చెప్పారు. ఈ ఘనత అందరికీ చెందుతుందన్నారు. ఈ ఉగ్రవాద దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని భారత దేశం కూడా చెప్తోంది. 


ఈ నేపథ్యంలో వీకే సింగ్ మాట్లాడుతూ, పుల్వామా ఉగ్రవాద దాడి గురించి సత్యాన్ని అంగీకరించినందుకు ఫవద్ చౌదరికి ధన్యవాదాలు చెప్తున్నానన్నారు. తాము మొదటి నుంచి ఇదే విషయాన్ని చెప్తున్నామన్నారు. పుల్వామాలో ఆధారాలన్నీ పాకిస్థాన్‌వైపే చూపుతున్నాయని తెలిపారు. పాకిస్థాన్ ఆశ్రయమిచ్చిన ఉగ్రవాదులపై మన దేశం చర్యలు తీసుకుందన్నారు. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పాకిస్థాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలను ఉపయోగించుకుంటుందని చెప్పారు. పాకిస్థాన్‌ను ఎఫ్ఏటీఎఫ్ (ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్) బ్లాక్ లిస్ట్‌లో పెట్టించాలన్నారు. 


ఇదిలావుండగా, విమర్శలు వెల్లువెత్తడంతో ఫవద్ చౌదరి వెనుకకు తగ్గారు. తాను భారత దేశంతో సత్సంబంధాలను కోరుకుంటున్నానని చెప్పారు. పుల్వామా గురించి తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు.


Updated Date - 2020-10-30T18:30:37+05:30 IST