భారత్ సరిహద్దు దాటుతూ భద్రతా దళాలకు చిక్కిన పాక్ యువకుడు.. అతను ఎందుకు బోర్డర్ దాటాడో తెలిస్తే షాక్..!
ABN , First Publish Date - 2021-12-28T22:45:24+05:30 IST
పాకిస్థాన్కు చెందిన ఓ యువకుడు ఇటీవల భారత్ సరిహద్దు దాటుతూ భద్రతా దళాలకు చిక్కాడు..
పాకిస్థాన్కు చెందిన ఓ యువకుడు ఇటీవల భారత్ సరిహద్దు దాటుతూ భద్రతా దళాలకు చిక్కాడు.. అతడిని అదుపులోకి తీసుకున్న సైన్యం విచారణ ప్రారంభించింది.. అతడు ఎందుకు బోర్డర్ దాటాడో విని షాకైంది.. ముంబైలో ఉన్న తన ప్రేయసిని కలిసేందుకే భారత్లోకి ప్రవేశించానని ఆ యువకుడు చెప్పాడు.. దీంతో సైన్యం అతడిని అదుపులోకి తీసుకుని లోతుగా విచారిస్తోంది.. రాజస్థాన్లోని సరిహద్దు ప్రాంతం శ్రీ గంగానగర్లో ఈ ఘటన జరిగింది.
పాకిస్థాన్లోని హసిల్పూర్కు చెందిన మహ్మద్ ఆమిర్(22)అనే యువకుడికి ఫేస్బుక్ ద్వారా ముంబైకి చెందిన మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా మారింది. ఆమెను నేరుగా కలవాలనుకున్నాడు. వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అతని వీసా అప్లికేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో అతను అక్రమంగా సరిహద్దు దాటాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో సైన్యం చేతికి చిక్కాడు.
సరిహద్దు భద్రతా దళానికి చెందిన పెట్రోలింగ్ బృందం ఆ యువకుడిని పట్టుకున్నప్పుడు అతడి వద్ద మొబైల్ ఫోన్, కొన్ని కరెన్సీ నోట్లు మాత్రమే ఉన్నాయి. ఆమిర్ చెప్పిన వివరాలు నిజమా? కాదా? అని భద్రతా సంస్థలు విచారణ ప్రారంభించాయి. విచారణ పూర్తయ్యాకే అతడిపై చర్యలు తీసుకుంటామని ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నారు.