వైభవంగా పద్మనాభుని గిరి ప్రదక్షిణోత్సవం

ABN , First Publish Date - 2022-01-17T06:32:04+05:30 IST

అనంత పద్మనాభుని క్షేత్రంలో ఆదివారం కనుమ పండుగ సందర్భంగా గిరి ప్రదక్షిణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

వైభవంగా పద్మనాభుని గిరి ప్రదక్షిణోత్సవం
పల్లకి సేవలో అనంత పద్మనాభస్వామి

పద్మనాభం, జనవరి 16: అనంత పద్మనాభుని క్షేత్రంలో ఆదివారం కనుమ పండుగ సందర్భంగా గిరి ప్రదక్షిణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. రైతులందరూ పాడిపంటలను సంక్రాంతి వేళ ఇళ్లకు తీసుకువచ్చేటప్పుడు స్వామివారు ఉద్యానవనానికి విశ్రాంతి కోసం వెళ్లే సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా కనుమరోజున ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఉదయం స్వామివారికి నిత్యార్చనలు ముగిశాక ఉభయ దేవేరులతో కూడిన అనంత పద్మనాభుని ఉత్సవ విగ్రహాలను వేదపండితుల ఆధ్వర్యంలో పల్లకిపై ఊరేగింపుగా అనంతుని గిరి ప్రదక్షిణకు పద్మనాభంలోని తిరువీధుల మీదుగా ఇసకలపాలెం, అర్చకునిపాలెం గ్రామాల్లోని రింగు రోడ్డు మీదుగా తీసుకువెళ్లారు. మార్గమధ్యంలో ఇసకలపాలెంలోని స్వామివారి ఉద్యానవనంలో శ్రీదేవి, భూదేవి సమేతుడైన అనంతుడు విహారానికి వెళ్లారు. అక్కడ దేవస్థానం నిర్మించిన మండపంపై ఉత్సవ విగ్రహాలను నిలిపి విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం, విశేషార్చనలు జరిపారు. అక్కడ నుంచి ప్రదక్షిణను మళ్లీ ప్రారంభించి అర్చకునిపాలెం మీదుగా స్వామివారు డోలా మండపానికి వెళ్లారు. అక్కడ కూడా ప్రత్యేక పూజలు నిర్వహంచాక తిరిగి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మార్గమధ్యంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ టి.పాప, ఉప సర్పంచ్‌ కె.అప్పలరాజు, మాజీ ఉప సర్పంచ్‌ కె.శివ, మాజీ ఎంపీటీసీ పద్మనాభస్వామి, ఉత్సవ కమిటీ సభ్యులు కె.ఎర్నాయుడు, టి.పద్దు, త్రినాథరావు, సన్నిబాబు, ఎ.రామారావు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-17T06:32:04+05:30 IST