మందుపాతరకు బలైన గిరిజనుల కుటుంబాలకు మావోల క్షమాపణ

ABN , First Publish Date - 2020-08-12T13:08:22+05:30 IST

విశాఖ ఏజెన్సీలోని పెదబయలు మండలం జామిగుడ అటవీ ప్రాంతంలో..

మందుపాతరకు బలైన గిరిజనుల కుటుంబాలకు మావోల క్షమాపణ

పెదబయలు ఏరియా కమిటీ పేరిట ఆడియో క్లిప్‌ విడుదల


పాడేరు(విశాఖపట్నం): విశాఖ ఏజెన్సీలోని పెదబయలు మండలం జామిగుడ అటవీ ప్రాంతంలో ఈనెల రెండో తేదీన మందుపాతరకు బలైన ఇద్దరు గిరిజనుల కుటుంబ సభ్యులకు మావోయిస్టులు క్షమాపణ చెప్పారు. ఈ మేరకు ఈ ఘటనపై మావోయిస్టు పార్టీ పెదబయలు ఏరియా కమిటీ కార్యదర్శి సుధీర్‌ మంగళవారం మీడియాకు ఆడియో క్లిప్‌ విడుదల చేశారు. పోలీసులు లక్ష్యంగా ఏర్పాటుచేసిన మందుపాతరకు ప్రమాదవశాత్తూ ఇద్దరు గిరిజనులు ప్రాణాలు కోల్పోయారన్నారు.


ఈ విషయం తెలిసిన వెంటనే తమ పార్టీకి చెందిన సభ్యులు మృతుల కుటుంబీకులను కలిసి క్షమాపణ కోరడంతోపాటు, ప్రగాఢ సానుభూతి తెలిపారని సుధీర్‌ తెలిపారు. తమ వైపు నుంచి జరిగిన తప్పులను నిజాయితీగా అంగీకరిస్తామని, కానీ పోలీసులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు. మందుపాతరకు బలైన ఇద్దరు గిరిజనులు తమ వర్గానికి చెందిన వ్యక్తులని, ఈ ఘటన కారణంగా బాధితులుగానీ, గ్రామస్థులు గానీ తమపై ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం చేయలేదన్నారు. అలాగే రైతులు పంట రక్షణ కోసం ఏర్పాటుచేసిన విద్యుత్‌ కంచెల కారణంగా పార్టీకి చెందిన కామ్రేడ్‌ అమరుడైనప్పుడు తాము ఏమీ అనలేదన్నారు.


తమకు, ప్రజల మధ్య సమన్వయం ఉందన్నారు. కానీ పోలీసులు మాత్రం కిరాయి వ్యక్తులతో తమకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారని సుధీర్‌ పేర్కొన్నారు. పోలీసులు డబ్బిచ్చి కొంతమంది ఉద్యమ ద్రోహులను పాడేరు నుంచి రప్పించి ర్యాలీ నిర్వహించారన్నారు. అమాయక ఆదివాసీలపై పోలీసులు కాల్పులు జరిపిన సందర్భాల్లో వారు ఎప్పుడు వాస్తవాలను అంగీకరించిన దాఖలాలు లేవన్నారు. పెదబయలు మండలం బురదమామిడి ప్రాంతంలో ఇద్దరు రైతులపై పోలీసులు కాల్పులు జరిపి, హతమార్చిన ఘటనలో వాస్తవం అంగీకరించకుండా వారిని సైతం మావోయిస్టులుగా చిత్రీకరించారన్నారు. ఇటువంటి ఘటనలు ఏవోబీలో అనేకం జరిగాయన్నారు. మావోయిస్టు పార్టీ ప్రజలకు ఎప్పుడూ ఎటువంటి హాని తలపెట్టదని, ప్రమాదవశాత్తూ జరిగే ఘటనల్లో వాస్తవాలను ప్రజలకు తెలుపుతున్నామన్నారు. 


Updated Date - 2020-08-12T13:08:22+05:30 IST