విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-10-28T06:17:18+05:30 IST

ఉద్యోగులు విధులకు గైర్హాజరైతే శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పాడేరు ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ హెచ్చరించారు.

విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు
కొత్తపాలెం పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న పీవో గోపాలక్రిష్ణ


ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ హెచ్చరిక

అన్నవరం సచివాలయంలో ఇద్దరు ఉద్యోగులకు ఒకరోజు జీతం నిలిపివేత

కొత్తపాలెం పాఠశాల హెచ్‌ఎం, టీచర్‌పై విచారణకు ఆదేశం


చింతపల్లి/గూడెంకొత్తవీధి, అక్టోబరు 27: ఉద్యోగులు విధులకు గైర్హాజరైతే శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పాడేరు ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ హెచ్చరించారు. బుధవారం చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో పర్యటించిన ఆయన తొలుత అన్నవరం గ్రామ సచివాలయం సందర్శించారు. ఉద్యోగుల హాజరు, మూమెంట్‌ రిజిస్టర్లను పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శి కె.శ్యామల, మహిళా సంరక్షణ కార్యదర్శి కె.కళావతి హాజరుకాకపోవడంతో ఒకరోజు వేతనం నిలిపివేయాలని ఎంపీడీవో లాలం సీతయ్యను ఆదేశించారు. రైతు భరోసా కేంద్రం భవన నిర్మాణాలు 15 రోజుల్లో పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ ఈఈని ఆదేశించారు. అనంతరం కొత్తపాలెం గ్రామ సచివాలయం, ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. ప్రధానోపాధ్యాయుడు ఎం.మోహన్‌రావు, తెలుగు టీచర్‌ పి.రాంబాబు లేకపోవడంతో విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని ఎంఈవో బోడం నాయుడుని పీవో ఆదేశించారు. అనంతరం విద్యార్థుల విద్యాప్రగతిని పరీక్షించారు. ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తరువాత గూడెంకొత్తవీధి రింతాడ బాలికల ఆశ్రమ పాఠశాలను, గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఈఈ కుమార్‌, జీకేవీధి ఎంపీడీవో చంద్రశేఖరరావు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-28T06:17:18+05:30 IST