పాడేరు కంటే అమరావతే దగ్గర..

ABN , First Publish Date - 2022-01-29T06:55:28+05:30 IST

ప్రభుత్వపరమైన పనుల కోసం ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి రావొచ్చు. అయితే చిత్రంగా వీరికి జిల్లా కేంద్రం వెళ్లడంకంటే రాష్ట్ర రాజధానికి వెళ్లడమే సులువు.

పాడేరు కంటే అమరావతే దగ్గర..

  • జిల్లా కేంద్రం కంటే రాష్ట్ర రాజధాని వెళ్లడమే సులువు
  • పాడేరు జిల్లా నోటిఫికేషన్‌పై సర్వత్రా వ్యతిరేకత
  • రంపచోడవరం జిల్లా ఏర్పాటు కోరుతూ ఏజెన్సీలోని 11 మండలాల నుంచీ గ్రామాల వారీగా తీర్మానాలు?
  • రాజమహేంద్రవరమైనా మన్యానికి అనుకూలమే

రంపచోడవరం, జనవరి 28 : ప్రభుత్వపరమైన పనుల కోసం ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి రావొచ్చు. అయితే చిత్రంగా వీరికి జిల్లా కేంద్రం వెళ్లడంకంటే రాష్ట్ర రాజధానికి వెళ్లడమే సులువు.  పాడేరు జిల్లా ఏర్పాటుతో రంపచోడవరం సెగ్మెంట్‌కు పాడేరుకంటే రాష్ట్రరాజధాని అమరావతే చేరువగా మారింది. నియోజకవర్గంలోని ఏ మూల నుంచి చూసినా 250 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్లకు పైగా పయనిస్తేనేగానీ జిల్లా కేంద్రం పాడేరుకు వీరు చేరలేరు. కానీ  200 కిలోమీటర్లు ప్రయాణిస్తే చాలు రాష్ట్ర రాజధాని అమరావతి సులువుగా చేరుకుంటారు. ఇదీ తమ దుస్థితి అని గిరిజనులు, ఇక్కడి నేతలు లబోదిబోమంటున్నారు. ఈ స్థితిపై అధికార పార్టీ సహా సర్వ త్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 11 మండలాలతో ‘రంప’ జిల్లా ఏర్పా టు చేయాలని, లేనిపక్షంలో తమకు చేరువగా జిల్లా కేంద్రం ఉండేలా ప్రత్యామ్నాయ చర్యలైనా తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. పాడేరు జిల్లా ప్రతిపాదనపై ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌పై అభ్యంతరాలను కోరడంతో పెద్దఎత్తున అభ్యంతరాలు దాఖలవుతున్నాయి. అధి కార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఆయా మండలాలు, పంచాయతీల నుంచి రంపచోడవరాన్ని పాడేరులో విలీనం చేస్తే ఎదురయ్యే కష్టనష్టాలను వివరిస్తూ తీర్మానాలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆదివాసీ సంఘాలు, టీడీపీ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాడేరులోకి విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన వ్యక్తంచేశారు. ఒకవేళ రంప జిల్లా సాధ్యం కాకపోతే, చేరువగా ఉండే తూర్పు గోదావరి జిల్లాలోనైనా కలపాలనే డిమాండూ వినిపిస్తోంది.

Updated Date - 2022-01-29T06:55:28+05:30 IST