గాలివానకు నేలకొరిగిన వరి
ABN , First Publish Date - 2022-05-20T06:29:32+05:30 IST
మండలపరిధిలోని చిన్నరామన్నగారిపల్లి వద్ద పెద్ద చెరువు కింద చిన్నరామన్నగారిపల్లి, గోపిరెడ్డిపల్లి, తొట్లివారిపల్లి, తురకవాని పల్లి గ్రామాలకు చెందిన రైతులు సాగుచేసిన వరి పంట గాలివానకు నేలకొరిగింది
తనకల్లు, మే 19: మండలపరిధిలోని చిన్నరామన్నగారిపల్లి వద్ద పెద్ద చెరువు కింద చిన్నరామన్నగారిపల్లి, గోపిరెడ్డిపల్లి, తొట్లివారిపల్లి, తురకవాని పల్లి గ్రామాలకు చెందిన రైతులు సాగుచేసిన వరి పంట గాలివానకు నేలకొరిగింది. బుధవారం సాయంత్రం గాలివానకు వంద ఎకరాల్లో వరి పొలం పడిపోవడంతో, రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆరుగాలం కష్టపడి సాగుచేసిన వరిపంట చేతికొచ్చిన దశలో నేలపాలు కావడం వేదనకు గురి చేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వంద ఎకరాల్లో రూ. 30లక్షలకు పైగా పంటనష్టం జరిగి ఉంటుందని గ్రామస్థులు తెలిపారు. జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ఈతోడు గ్రామ సచివాలయానికి చెందిన విలేజీ అగ్రికల్చర్ అసిస్టెంట్ హనుమంతరెడ్డి గ్రామంలో పర్యటించారు. రైతుల వద్దనుంచి వినతిపత్రాలను స్వీకరిం చారు. ప్రభుత్వం తమకు జరిగిన నష్టాన్ని భర్తీచేయాలని రైతులు కోరారు.
ప్రభుత్వానికి నివేదికలు పంపుతాం : ఏఓ
చిన్నరామన్నగారిపల్లి చెరువు కింద గాలివర్షానికి వరి పంట నష్టపోయిన రైతులందరి వివరాలు సేకరిస్తాం. జరిగిన నష్టాన్ని అంచనా వేసి, ప్రభుత్వానికి నివేదికలు పంపుతామని మండల వ్యవసాయాధికారి శ్రీహరినాయక్ తెలిపారు. ప్రభుత్వం నష్టపరిహారం మంజూరు చేస్తే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని, గతంలోనూ వరి పొలాలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించినట్లు తెలిపారు.