పడాల్‌.. బ్రిటీషర్లకు హడల్‌

ABN , First Publish Date - 2022-08-12T06:26:33+05:30 IST

అల్లూరి అనుచరుల్లో గాం గంటన్నదొర, మల్లుదొర తరువాత స్థానం పండు పడాల్‌దే. చింతపల్లి మండలం గొందిపాకలు గ్రామ పంచాయతీకి చెందిన బోనంగి అండయ్య, బంగారమ్మల దంపతులకు పండు పడాల్‌ 1890 ఆగస్టు 13న జన్మించారు.

పడాల్‌.. బ్రిటీషర్లకు హడల్‌
గొందిపాకలులో పడాల్‌ విగ్రహం

- స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గిరిజన వీరుడు 

- అల్లూరికి ముఖ్య అనుచరుడు

- సీతారామరాజుతో కలిసి పోలీస్‌ స్టేషన్లపై దాడి

- బ్రిటీష్‌ పోలీసుల హిట్‌లిస్ట్‌లో చేరిన పేరు

- పోలీసులకు పట్టించిన సోదరి

- సుదీర్ఘ కాలం జైలు జీవితం


13న పండు పడాల్‌ జయంతి సందర్భంగా..


బ్రిటీష్‌ పాలకుల దురాగతాలపై సాయుధ పోరాటం చేసిన గిరిజన స్వాతంత్య్ర ఉద్యమ వీరుల్లో బోనంగి పండు పడాల్‌ ఒకరు. అల్లూరి సీతారామరాజు ముఖ్య అనుచరుడిగా సాయుధ పోరాటం సాగించి పలు దాడుల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. అల్లూరి మరణం అనంతరం బ్రిటీష్‌ పోలీసులకు పట్టుబడి సుదీర్ఘకాలం అండమాన్‌లో జైలు జీవితం గడిపారు. అక్కడే తనువు చాలించారు. ఆయన జయంతిని ఏటా ఆగస్టు 13న గొందిపాకలు గ్రామస్థులు ఘనంగా నిర్వహిస్తుంటారు.


చింతపల్లి, ఆగస్టు 11: అల్లూరి అనుచరుల్లో గాం గంటన్నదొర, మల్లుదొర తరువాత స్థానం పండు పడాల్‌దే. చింతపల్లి మండలం గొందిపాకలు గ్రామ పంచాయతీకి చెందిన బోనంగి అండయ్య, బంగారమ్మల దంపతులకు పండు పడాల్‌ 1890 ఆగస్టు 13న జన్మించారు. 30 ఏళ్ల వయస్సులో అదే గ్రామానికి చెందిన లింగయమ్మతో వివాహమైంది. అప్పటికే బ్రిటీష్‌ పాలకుల దురాగతాలు పెచ్చుమీరిపోయాయి. అదే సమయంలో అల్లూరి సీతారామరాజు మన్యంలో అడుగుపెట్టి సాయుధ పోరాటానికి శ్రీకారం చుట్టారు. అల్లూరి పోరాటానికి పండు పడాల్‌ ఆకర్షితుడయ్యారు. అల్లూరిని అనుసరించారు. సాయుధ పోరాటానికి అల్లూరి వెంట వెళ్లిన సమయంలో అతని భార్య ఎనిమిది నెలల గర్భిణి.

సాయుధ పోరాటంలో పడాల్‌ పాత్ర

సీతారామరాజుతో కలిసి పోలీస్‌ స్టేషన్ల దాడుల్లో పండు పడాల్‌ పాల్గొన్నారు. ప్రధానంగా 1922 సెప్టెంబరులో కృష్ణాదేవిపేట వద్ద బ్రిటీష్‌ సైనికాధికారులు హైటర్‌, క్లవర్ట్‌లను అంతమొందించిన దాడిలో పండు పడాల్‌ ప్రధాన భూమిక పోషించారు. దీంతో బ్రిటీష్‌ పోలీసుల హిట్‌లిస్ట్‌లో పండు పడాల్‌ చేరారు. నాటి నుంచి అల్లూరి సీతారామరాజుతో పాటు ఆయన అనుచరుల్లో ఒకరైన పండు పడాల్‌ని పట్టుకునేందుకు బ్రిటీష్‌ పోలీసులు కార్యాచరణ ప్రారంభించారు. దీంతో పండు పడాల్‌ అజ్ఞాత జీవితాన్ని కొనసాగించాల్సి వచ్చింది. 

బ్రిటీష్‌ పోలీసులకు పట్టించిన సోదరి

అల్లూరి సీతారామరాజు మరణం అనంతరం పండు పడాల్‌ కోసం బ్రిటీష్‌ పోలీసులు గాలింపు చర్యలను విస్తృతం చేశారు. ఈ క్రమంలో అతని కుటుంబ సభ్యులను చిత్రహింసలకు గురిచేసేవారు. దీంతో పండు పడాల్‌ సోదరి(ఆక్క) రామయమ్మ భోజనానికి ఇంటికి పిలిచి బ్రిటీష్‌ పోలీసులకు సమాచారం ఇచ్చింది. భోజనానికి వచ్చిన పండు పడాల్‌ని బ్రిటీష్‌ పోలీసులు 1924 జూన్‌లో అరెస్టు చేశారు. 

సుదీర్ఘకాలం జైలు జీవితం

పండు పడాల్‌ సుదీర్ఘకాలంగా జైలు జీవితాన్ని అనుభవించారు. బ్రిటీష్‌ పోలీసులకు పట్టుబడిన పడాల్‌కు విశాఖపట్నం సెషన్స్‌ కోర్టు 1925 మే 11న మరణశిక్ష విధించింది. ఈ శిక్షను మళ్లీ యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. దీంతో రాజమండ్రి, తిరుచురాపల్లి జైళ్లలో ఆయన శిక్షణ అనుభవించారు. 1926లో పడాల్‌ని అండమాన్‌లో ప్రవాస శిక్షకు పంపించారు. నాటి నుంచి దేశానికి స్వాతంత్య్రం వచ్చే వరకు అండమాన్‌ సెల్యూలార్‌ జైలులో శిక్షను అనుభవించారు.

అండమాన్‌లో స్థిర నివాసం

జైలు నుంచి విడుదలైన పండు పడాల్‌ అండన్‌మాన్‌లోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. విడుదలైన వెంటనే తహసీల్దార్‌ ద్వారా గొందిపాకలులోనున్న అతని భార్య లింగాయమ్మను అండమాన్‌ రప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఆమె నిరాకరించింది. దీంతో అండమాన్‌లో పార్వతి అనే మహిళను వివాహం చేసుకున్నారు. ఇరువురి దంపతులకు ఐదుగురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. 1974 ఫిబ్రవరి 11న పండు పడాల్‌ అండన్‌మాన్‌లో మరణించారు. 1973లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ పడాల్‌ జీవిత చరిత్రను సేకరించింది. అప్పట్లో ఓ తెలుగు దినపత్రిక పడాల్‌ జీవిత చరిత్రను ప్రముఖంగా ప్రచురించింది. అనంతరం అండమాన్‌లో పండు పడాల్‌ కుటుంబ సభ్యులు తండ్రి స్వగ్రామం గొందిపాకలను వెతుక్కుంటూ వచ్చి స్థానిక కుటుంబ సభ్యులను కలిశారు. ఆయన పోరాటపటిమకు స్ఫూర్తిగా పడాల్‌ కుమారుడు శివరాజు పడాల్‌ 2012 ఫిబ్రవరి 29న గొందిపాకలులో పండు పడాల్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఏటా ఆ గ్రామస్థులు పండు పడాల్‌ జయంతిని ఆగస్టు 13న ఘనంగా నిర్వహిస్తున్నారు.


Updated Date - 2022-08-12T06:26:33+05:30 IST