పోలీసులు తోసేశారు.. పక్కటెముకలు విరిగాయి: చిదంబరం
ABN , First Publish Date - 2022-06-14T03:20:43+05:30 IST
దేశ రాజధాని ఢిల్లీలో నేడు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరాన్ని పోలీసులు నెట్టివేయడంతో
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నేడు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరాన్ని పోలీసులు నెట్టివేయడంతో ఆయన ఎడమ పక్కటెముకలో ఫ్రాక్చర్ అయింది. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈడీ విచారణకు హాజరయ్యేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఈడీ కార్యాలయం బయట వందలాదిమంది కార్యకర్తలు నిరసనకు దిగారు. ఈ కార్యక్రమంలో చిదంబరం కూడా పాల్గొన్నారు. పోలీసులు తోసివేయడంతో తన పక్కటెముక విరిగిందని అయితే, హెయిర్లైన్ క్రాక్తో బయటపడడం తన అదృష్టమని చిదంబరం ట్వీట్ చేశారు.
ముగ్గురు బలమైన పోలీసులు మీపైకి దూసుకొచ్చినప్పుడు హెయిర్లైన్ పగుళ్లతో బయటపడితే మీరు అదృష్టవంతులేనని పేర్కొన్న చిదంబరం.. గాయం పది రోజుల్లో దానంతట అదే నయమైపోతుందని వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని, రేపు (మంగళవారం) నుంచి తిరిగి కార్యకలాపాలు ప్రారంభిస్తానని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. మరో నేత రణదీప్ సూర్జేవాలా మాట్లాడుతూ.. ప్రమోద్ తివారీని పోలీసులు రోడ్డుపైకి విసిరేశారని, ఆయన తలకు గాయాలయ్యాయని పేర్కొన్నారు.