కరోనాపై కొత్త అస్త్రాలు.. రంగంలోకి దిగిన ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు!

ABN , First Publish Date - 2021-01-21T21:26:16+05:30 IST

కరోనా వైరస్‌ను నిలువరించేందుకు ప్రపంచానికి కోవీషీల్డ్ టీకా అందించిన ఆక్సఫర్డ్ శాస్త్రవేత్తలు మరోసారి రంగంలోకి దిగారు. కరోనా వైరస్ కొత్త అవతారాలు(స్ట్రెయిన్‌లు) ఎత్తుతున్న నేపథ్యంలో కోవీషీల్డ్‌కూ కొత్త రూపాల్ని ఇచ్చేందుకు వారు నడుం కట్టారు.

కరోనాపై కొత్త అస్త్రాలు.. రంగంలోకి దిగిన ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు!

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను నిలువరించేందుకు ప్రపంచానికి కోవీషీల్డ్ టీకా అందించిన ఆక్సఫర్డ్ శాస్త్రవేత్తలు మరోసారి రంగంలోకి దిగారు. కరోనా వైరస్ కొత్త అవతారాలు(స్ట్రెయిన్‌లు) ఎత్తుతున్న నేపథ్యంలో కోవీషీల్డ్‌కూ కొత్త రూపాల్ని ఇచ్చేందుకు వారు నడుం కట్టారు. కోవిషీల్డ్ తయారీకి వినియోగించిన సాంకేతికతకు కొద్ది మార్పులను చేయడం ద్వారా టీకాకు సంబంధించి కొత్త వెర్షన్లను రూపొందించేందుకు ఆక్సఫర్డ్ యూనివర్శిటీ, ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా శాస్త్రవేత్తల బృందం ప్రయత్నిస్తున్నట్టు అంతర్జాతీయ వీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే బ్రిటర్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల్లో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్లు బయటపడ్డ విషయం తెలిసిందే.


కాగా. ఈ అంశాలపై ఆక్స్‌ఫర్డ్ ప్రతినిధి స్పందించారు. కొత్త టీకా వెర్షన్ల కోసం కోవిషీల్డ్ తయారీకి వినియోగించిన సాంకేతికతకు ఎటువంటి మార్పులు చేయాలనేదానిపై అధ్యయనం చేస్తున్నట్టు తెలిపారు. ఈ విషయమై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా బుధవారం నాడు కీలక ప్రకటన చేశారు. కొత్త స్ట్రెయిన్లను నిలువరించే టీకా కొత్త వర్షెన్లకు అనుమతివ్వాల్సిన సందర్భం తలెత్తితే అందుకు  ఔషధ నియంత్రణ సంస్థ సిద్ధమవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతమున్న ఫైజర్-బయోఎన్‌టెక్ టీకా బ్రిటన్‌లోని కరోనా స్ట్రెయిన్‌ను అడ్డుకోగలదని ఇటీవల జరిపిన పరీక్షల్లో వెల్లడైంది.  అయితే..దక్షిణాఫ్రికాలోని స్ట్రెయిన్‌పై ఈ టీకా ప్రభావం ఎంతో తెలుసుకునేందుకు బయో ఎన్ టెక్ సంస్థ విస్తృత అధ్యయనం చేపడుతోంది. త్వరలో దీని ఫలితాలను వెలువరిస్తామని వెల్లడించింది. 

Updated Date - 2021-01-21T21:26:16+05:30 IST