కొవిడ్ సంవత్సరంలో railway tracksపై 27వేల పశువుల మృతి

ABN , First Publish Date - 2021-10-18T17:03:13+05:30 IST

మేత కోసం వచ్చిన పశువులు రైలు పట్టాలు దాటుతూ రైళ్ల కింద పడి మృత్యువాత పడుతున్నాయి...

కొవిడ్ సంవత్సరంలో railway tracksపై 27వేల పశువుల మృతి

న్యూఢిల్లీ : మేత కోసం వచ్చిన పశువులు రైలు పట్టాలు దాటుతూ రైళ్ల కింద పడి మృత్యువాత పడుతున్నాయి. కరోనా సంవత్సరంలో రైలు పట్టాలపై రైళ్ల కిందపడి 27వేల పశువులు మరణించాయి. 2020 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు 27వేల పశువులు రైళ్ల కింద పడి మరణించడంతో పట్టాలు రక్తసిక్తంగా మారాయి. కరోనా మహమ్మారికి ముందు 2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకు రైళ్ల కింద పడి 38వేల పశువులు మరణించాయి.కరోనా అనంతరం రాకపోకలు సాగించే రైళ్ల సంఖ్య పెరగడంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు 20వేలకు పైగా పశువులు మరణించాయి.


గత ఏడాది మార్చి 22వతేదీన ప్యాసింజరు రైళ్ల సర్వీసులను రైల్వేశాఖ నిలిపివేసింది. ప్యాసింజరు రైళ్ల రాకపోకలను రద్దు చేసినా నిత్యావసర వస్తువులను గమ్యస్థానాలకు చేరవేసేందుకు గూడ్స్ రైళ్లను నడుపుతూనే ఉంది. కరోనా సమయంలో శ్రామిక్ స్పెషల్ రైళ్లను నడపడంతో వీటి కింద పడి 1000 పశువులు మరణించాయి. కొవిడ్ సెకండ్ వేవ్ సమయంలో నెలకు 2,600 ఆవులు ట్రాక్ లపై పడి మరణించాయి. ఆగస్టు నెలలో అత్యధికంగా 4,200 పశువులు రైళ్ల కిందపడి మరణించాయి.పశువులతోపాటు ఏనుగులు ఇతర వన్యప్రాణులు కూడా రైళ్ల కిందపడి మరణించాయి.


ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రైలు పట్టాలపై అత్యధిక పశువుల మరణాలు సంభవించాయి. తుండ్లా-కాన్పూర్, ఫిరోజాబ్ద్-మఖన్‌పూర్, ఎటావా-ఫఫండ్,కాన్పూర్ సమీపంలోని చందేరి-చాకేరి మధ్య, హత్రాస్ సమీపంలో పోరా-జలేసర్, మధుర-కోసికలాన్ విభాగంలోని ఆగ్రా-ధోల్పూర్ మార్గాల్లో రైలు పట్టాలపై పశువుల మరణాలు అధికంగా సంభవించాయి.రైలు పట్టాలకు సమీపంలోకి పశువులను రాకుండా ఆపాలని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు, రైల్వే అధికారులు కోరారు.


Updated Date - 2021-10-18T17:03:13+05:30 IST