కరోనా 1003
ABN , First Publish Date - 2020-08-03T11:09:30+05:30 IST
జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు వెయ్యికి పైగానే కేసులు నమోదయ్యా యి. ఈ ఏడాది మార్చి నెలలో 5.. ఏప్రిల్లో 7.. మే నెలలో
కామారెడ్డి జిల్లాలో వెయ్యి దాటిన పాజిటివ్ కేసులు
మార్చి నుంచి జూన్ వరకు 59 మాత్రమే
జూలైలో మాత్రం 796 కేసుల నమోదు
మరణాల సంఖ్య సైతం పెరుగుతోంది
ఇప్పటి వరకు కరోనాతో 17 మంది మృతి
జిల్లాలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న పాజిటివ్ కేసులు
అన్ని ప్రాంతాల్లో విస్తరించిన వైరస్
బాన్సువాడ పట్టణాల్లోనే అత్యధిక కేసులు
కామారెడ్డి, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు వెయ్యికి పైగానే కేసులు నమోదయ్యా యి. ఈ ఏడాది మార్చి నెలలో 5.. ఏప్రిల్లో 7.. మే నెలలో 0.. జూన్లో 47.. జూలైలో 796.. ఆగష్టు నెలలోని రెండు రోజుల్లో 136 ఇవన్నీ జిల్లాలో ఆయా నెలల్లో నమెదయిన కరోనా పాజిటివ్ కేసులు. నెలవారీ గా నమోదయిన కేసులను బట్టి చూస్తే జిల్లాలో వైరస్ ఏ స్థాయిలో విస్తరించి ఉందో తెలుస్తోంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్న కొద్ది మరణాల సంఖ్య కూడా పెరుగుతునే ఉన్నాయి. గత 15 రోజుల నుంచి జిల్లా హెల్త్బులిటెన్ను అధికారులు నిలిపివేశారు. అధికారి కంగా జిల్లాలో 986 కేసులు నమెదయినట్లు అధికారు ల లెక్కలు చెబుతున్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా రక్తన మూనాలు, ర్యాపిడ్, మైగ్రెంట్ కేసులతో కలుపుకొని జిల్లాలో 1003 పాజిటివ్ కేసులకు చేరినట్లు తెలుస్తో ంది. మార్చి నుంచి జూన్ వరకు పదుల సంఖ్యలోనే నమోదయిన పాజిటివ్ కేసుల సంఖ్య జూలైలో మాత్రం వైరస్ ఒకసారిగా విరుచుకుపడింది. ప్రతీరోజు 30కి పైగానే కేసులు నమోదవుతూ వచ్చాయి. ఇలా జూలై నెలలోనే 796 కేసులు నమోదయ్యాయంటే వైరస్ తీవ్రత ఎలా ఉందో తెలుస్తోంది. ఆగస్టు నెల సీజనల్ వ్యాధులకు పెట్టిన పేరు. దీనికి తోడు పండుగలు, శుభకార్యాలు మెండుగానే ఉంటాయి. ఈ నెల ప్రారంభమైన రెండు రోజుల్లోనే 136 కేసులు నమోదయ్యా యంటే నెల చివరికల్లా ఎన్ని కేసులు నమోదవుతాయే వేచి చూడాలి.
పెరుగుతున్న మరణాలు
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఓ వైపు విపరీతంగా పెరుగుతునే ఉండగా మరోవైపు మరణాల సంఖ్య సైతం ఎక్కువవుతున్నాయి. జిల్లాలో కరోనా భారిన పడి ఇప్పటి వరకు 17 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కానీ వైద్యఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం ఆరుగురు మాత్రమే మృతి చెందినట్లు ప్రకటించారు. కామారెడ్డి పట్టణంలో కరోనాతో ఇప్పటి వరకు 6 గురు మృతి చెందగా, బాన్సువాడలో 4 గురు, గాంధారిలో 1, తాడ్వాయిలో 1, రాజంపేటలో 1, భిక్కనూర్లో 1, బీర్కుర్లో 1 తాజాగా ఎల్లారెడ్డిలో మరొక్కరు మృతి చెందారు. ఇందులో చాలా మంది ఆయా ఆసుపత్రుల్లో దీర్ఘకాలిక రోగా లతో చికిత్స పొందుతూ మృతి చెందగా అనం తరం నిర్వహించిన రక్తనమూనాల పరీక్షలో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యులు పేర్కొంటున్నారు. దీర్ఘకాటిక జబ్బు లకు కరోనా తోడవడంతో రోగుల పరిస్థితి విషమించి మృత్యువాత పడుతున్నట్లు వైద్యుల పరిశీలనలో తెలుతోంది. మరికొందరు ఎలాంటి రోగాలు లేకున్నప్పటికీ కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతునే మృతి చెందారు.
జిల్లా వ్యాప్తంగా విస్తరించిన వైరస్
కరోనా వైరస్ జిల్లాలోని పట్టణాలు, పల్లెలు అని తేడా లేకుండా అంతటా విస్తరించింది. మారుమూల గ్రామాలు, తండాల్లోనూ ప్రజలు కరోనా వైరస్ భారిన పడుతున్నారు. మొదట కామారెడ్డి, బాన్సువాడ పట్టణ ప్రాంతాలలో మాత్రమే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మార్చి నెలలో 21న బాన్సువాడ పట్టణంలో మర్కజ్కు వెళ్లొచ్చిన వ్యక్తికి మొదటి పాజిటివ్ కేసు నమోదయింది. లాక్డౌన్ సమయంలో మార్చి, ఏప్రిల్, మే నెలలో కామా రెడ్డి, బాన్సువాడలో మొత్తం 12 కేసులు మాత్రమే నమోద య్యాయి. జూన్ నెలలో 47 కేసులు నమెదు కాగా జూలై లో 932 కేసులు నమోదయ్యాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా 1003 కేసులు నమోదయ్యాయి. ఇందులోంచి 120 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కామారెడ్డి, బాన్సువాడ పట్టణాల్లోనే ఇప్పటి వరకు 7 వందల పాజిటివ్ కేసులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక జిల్లాలోని 22 మండలాల్లోని ఆయా గ్రామాల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కో మండలాల్లో పది చొప్పున పాజిటివ్ కేసులు నమోద యినట్లు తెలుస్తోంది. ఇలా జిల్లా వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరించింది.
క్వారంటైన్, కంటోన్మెంట్ ఏర్పాటు
జిల్లాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండ డంతో జిల్లా యంత్రాంగం వైరస్ కట్టడికి పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే జిల్లాలో 15 కంటోన్మె ంట్ జోన్లను ఏర్పాటు చేశారు. ఇందులో కామారెడ్డిలో 7, పిట్లం 1, ఎల్లారెడ్డి 1, బీబీపేట 1, బాన్సువాడ 4, భిక్కనూర్ 1 ఏర్పాటు చేసి ఆ ప్రాంతాల్లో పాజిటివ్ వచ్చిన వారిపై నిఘా ఉంచడం స్థానికంగా పారిశుధ్య కార్యక్రమాలతో పాటు సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేస్తు న్నారు. కరోనాపై వైద్యాధికారులు కంటోన్మెంట్ జోన్లలో కరో నాపై అవగాహన కల్పిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్ర మత్తం చేస్తున్నారు. కరోనా భారిన పడిన వారికి చికిత్స నిమిత్తం జిల్లా వ్యాప్తంగా క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. కామారెడ్డి డివిజన్ పరిధిలో భిక్కనూర్ మండలం సౌత్క్యాంపస్, ఎల్లారెడ్డిలోని సోమర్పేట్ గ్రామంలో మోడ ల్ స్కూల్లో, బాన్సువాడ డివిజన్లో బోర్లంలోని మైనారి టీ రెసిడెన్షియల్ స్కూల్లో అందుబాటులో ఉంచారు. వీటితో పాటు ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 40 బెడ్లతో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆక్సిజన్, ఐసీయూ సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. దోమకొండలో 25 బెడ్లతో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందులో 4గురు బాధితులు చికిత్స పొందు తున్నారు.
అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు
జిల్లాలో రోజు రోజుకూ కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో వైద్యులు పలు సూచనలు చేస్తున్నా ప్రజలు మాత్రం వాటిని పట్టించుకో వడం లేదని దీంతో వైరస్ సామాజిక వ్యాప్తి ఎక్కువ అవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ ఎక్కడ ఇరుగు పొరుగు వారు తమను ఈసడించుకుంటారో అనే భయంతో తమకు తెలిసిన సొంత వైద్యం చేసుకుంటూ అప్పటి మందం ఉపశమనం లభించగానే రోజు వారి పనులలో నిమగ్నమ వుతూ మరింత మందికి వైరస్ సోకేలా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలే సీజనల్ వ్యాధుల కాలమని ఏది కరోనా వైరస్, ఏది సీజనల్ వ్యాధో తెలువా లంటే ఖచ్చితంగా వైద్యున్ని వద్దకు వెళ్లి తగు చికిత్సలతో పాటు సూచనలు పాటించాలని అంటున్నారు. ఎప్పటి కప్పుడు పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రిలో వైద్యునికి సంప్రదించాలని సూచిస్తున్నారు.