కుప్పకూలిన గ్యాలరీ.. 200 మందికి గాయాలు

ABN , First Publish Date - 2022-10-29T23:31:17+05:30 IST

కేరళలో విషాదం చోటు చేసుకుంది. ఫుట్‌బాల్ స్టేడియం గ్యాలరీ కుప్పకూలడంతో దాదాపు 200 మందికిపైగా ప్రేక్షకులు గాయపడ్డారు.

కుప్పకూలిన గ్యాలరీ.. 200 మందికి గాయాలు

కేరళలో విషాదం చోటు చేసుకుంది. ఫుట్‌బాల్ స్టేడియం గ్యాలరీ కుప్పకూలడంతో దాదాపు 200 మందికిపైగా ప్రేక్షకులు గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన కేరళ, మలప్పురం పరిధిలోని పూంగాడ్‌లో శనివారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం పూంగాడ్‌లో లోకల్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ జరుగుతోంది. స్టేడియం చుట్టూ ప్రేక్షకులు కూర్చోవడానికి నిర్వాహకులు తాత్కాలిక గ్యాలరీ ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్ చూసేందుకు దాదాపు వెయ్యి మందికిపైగా ప్రేక్షకులు స్టేడియానికి వచ్చారు. వీళ్లంతా స్టాండ్స్ ఎక్కి కూర్చున్నారు. 


మ్యాచ్ జరుగుతుండగా రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో గ్యాలరీ ఒకవైపు ఉన్నట్టుండి కూలిపోయింది. దీంతో గ్యాలరీలో ఉన్న దాదాపు 200 మందికి పైగా ప్రేక్షకులు గాయపడ్డారు. గ్యాలరీ కూలడంతో భయపడ్డ ప్రేక్షకులు ఒక్కసారిగా పరుగెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఇది కూడా ఎక్కువమంది గాయపడేందుకు కారణమైంది. బాధితుల్లో పిల్లలు కూడా ఉన్నారు. గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టోర్నమెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2022-10-29T23:31:17+05:30 IST