ఔట్ సోర్సింగ్
ABN , First Publish Date - 2022-05-12T04:57:04+05:30 IST
జిల్లాలో అవుట్ సోర్సింగ్ పద్ధతిన ఉద్యోగంలో చేరిన పంచాయతీ కార్యదర్శుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారబోతోంది. ప్రభుత్వం నిర్వహించిన రాత పరీక్షల్లో అర్హత సాధించి కొలువుకొట్టినా ఇప్పుడు ఆ సంతోషం ఎంతోకాలం నిలిచేలా లేని పరిస్థితి కనిపిస్తోంది.
- అమలుకు నోచుకోని ఉన్నతాధికారుల హామీ
- పని చేస్తున్నా ఖాళీ పోస్టుగా నివేదిక
- జేపీఎస్ నోటిషికేషన్కు సిద్ధమవుతున్న సర్కారు
- అయోమయంలో ఓపీఎస్ల భవితవ ్యం
కామారెడ్డి, మే 11: జిల్లాలో అవుట్ సోర్సింగ్ పద్ధతిన ఉద్యోగంలో చేరిన పంచాయతీ కార్యదర్శుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారబోతోంది. ప్రభుత్వం నిర్వహించిన రాత పరీక్షల్లో అర్హత సాధించి కొలువుకొట్టినా ఇప్పుడు ఆ సంతోషం ఎంతోకాలం నిలిచేలా లేని పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం వీరిని పరిగణలోకి తీసుకోకుండా కొత్త నోటిఫికేషన్ వైపే మొగ్గు చూపుతుండడంతో ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటోననే అంతర్మథనం మొదలైంది. జిల్లాలోని 526 గ్రామ పంచాయతీల్లో 69 మంది పంచాయతీ కార్యదర్శులతో పాటు 425 జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, 32 మంది అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులుగా పని చేస్తున్నారు.
2019లో పంచాయతీ కార్యదర్శుల నియామక పరీక్ష
పంచాయతీల్లో మెరుగైన సేవలు అందించడంతో పాటు గ్రామాల్లో పరిపాలన పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా 2019లో ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శుల నియామకాలకు గాను రాతపరీక్ష నిర్వహించింది. ఇందులో అర్హత సాధించిన నిరుద్యోగులు సర్కారు కొలువు వచ్చిందని సంతోషించేలోపే అవుట్ సోర్సింగ్ ద్వారా నియామకాలు చేపడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. తమను రెగ్యూలర్గా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేయడంతో రెండు, మూడు నెలల్లో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్)గా బాధ్యతలు అప్పగిస్తామని ఓపీఎస్లుగానే నియమించారు. వీరిని ఇప్పటి వరకు జేపీఎస్గా నియామకం చేపట్టకపోవడంతో నెలలుగా వేచిచూస్తుండడం కొసమెరుపు
పనిలో ఉన్నా.. ఖాళీలుగానే..
పంచాయతీ కార్యదర్శుల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో కొత్త నోటిఫికేషన్కు సిద్ధం అవుతున్న నేపథ్యంలో జిల్లాలోని ఖాళీలను అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. జిల్లాలో ఓపీఎస్లుగా పని చేస్తున్న 32 మంది గ్రామాలను కూడా ఖాళీ ఉన్నట్లు నివేదిక తయారు చేశారు. దీంతో చాలా మంది తమ పోస్టులను మినహయించి మిగిలిన వాటికి మాత్రమే నోటిషికేషన్లు వేయాలని పేర్కొంటున్నారు. ఏదేమైనా నోటిషికేషన్లు వెలువడే వరకు తమ భవితవ్యం ఏమిటోననే ఆందోళనలో ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
పని భారం.. అరకొర వేతనం
అసలే పని భారం.. ఆపై ఒత్తిడి మరోవైపు చాలీచాలని వేతనం వెరసి ఓపీఎస్లు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది బదిలీకావం, మరికొంత మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఆ ఖాళీలను రాత పరీక్షల్లో హాజరైన వారిలో మెరిట్ ఉన్న వారిని ఇంటర్వ్యూలకు పిలిచి మరీ తీసుకున్నారు. జేపీఎస్గా అవకాశం వస్తుందనే ఆశతో ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఓపీఎస్లు పని ఒత్తిడితో పని చేస్తున్నారు. మొదట ఓ ఏజెన్సీకి అప్పగించగా వారు రూ.15వేలు చెల్లించగా ఈఎస్ఐ, పీఎఫ్ అంటూ రూ.5వేల వరకు కటింగ్ చేస్తూ రూ.10 వేలు మాత్రమే చెల్లిస్తున్నట్లు సమాచారం. ఈ అరకొర వేతనంతో కుటుంబ పోషణ భారం అవుతుందని ఓపీఎస్లు వాపోతున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు
సాయిబాబా, ఇన్చార్జ్ డీపీవో, కామారెడ్డి
జిల్లాలో ఓపీఎస్లుగా 32 మంది పని చేస్తున్నారు. ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శుల పోస్టుల నియామకాలకు ఖాళీల నివేదిక పంపించాలనే ఆదేశాల మేరకు నివేదించాం. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఖాళీలతో పాటు ఓపీఎస్ల స్థానాలను కూడా ఖాళీలుగా చూపాం.