విద్యుత్‌ చార్జీలపై ఆగ్రహం

ABN , First Publish Date - 2020-05-22T09:28:27+05:30 IST

కరోనా కష్టకాలంలో విద్యుత్‌ చార్జీల పెంపును నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా టీడీపీ శ్రేణులు గురువారం

విద్యుత్‌ చార్జీలపై ఆగ్రహం

జిల్లావ్యాప్తంగా టీడీపీ శ్రేణుల నిరసన దీక్షలు

కరోనా వేళ కనికరం చూపని వైసీపీ సర్కారు

లాక్‌డౌన్‌ కాలంలో కరెంబ్‌ బిల్లులు మాఫీచేయాలి

టీడీపీ నేతల డిమాండ్‌


గుంటూరు, మే 21 (ఆంధ్రజ్యోతి): కరోనా కష్టకాలంలో విద్యుత్‌ చార్జీల పెంపును నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా టీడీపీ శ్రేణులు గురువారం పెద్దఎత్తున నిరసన దీక్షలు చేపట్టాయి. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపుమేరకు నియోజకవర్గ, మండల కేంద్రాలతోపాటు ప్రతి గ్రామంలోనూ పార్టీనాయకులు, కార్యకర్తలు ఇళ్లలోనే  నిరాహార దీక్షలు చేశారు. ఓవైపు లాక్‌డౌన్‌తో ఉపాధిలేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కొత్తశ్లాబ్‌ విధానంతో అధిక విద్యుత్‌ బిల్లులు జారీచేయడం దారుణమని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. లాక్‌డౌన్‌కాలంలో కరెంట్‌ బిల్లులను మాఫీచేయాలని, పాత శ్లాబ్‌విధానాన్నే కొనసాగించాలని టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు.


హైదరాబాద్‌లో హోం క్వారంటైన్‌లో ఉన్న గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావులు అక్కడే నిరాహారదీక్షలు చేపట్టి కరెంటు చార్జీల పెంపుపై ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ముఖ్యమంత్రి జగన్‌ విద్యుత్‌ చార్జీలు పెంపుదల చేసి పేదలపై పెనుభారం మోపారని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ధ్వజమెత్తారు. 


  వైసీపీ ప్రభుత్వానికి పరిపాలన చేయడం చేతగాకనే ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్రినక్కా ఆనందబాబు మండిపడ్డారు. విద్యుత్‌చార్జీల పెంపుపై గుంటూరులోని తన నివాసంలో ఎమ్మెల్సీ డాక్టర్‌ ఏఎస్‌ రామకృష్ణ, మన్నవ సుబ్బారావు, కోవెలమూడి రవీంద్రలతో నిరసనదీక్ష చేపట్టారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష,్ణ సహాయ కార్యదర్శి ముప్పాళ నాగేశ్వరరావు సంఘీభావం తెలిపారు. వైసీపీ ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలు పెంచి ఇబ్బందుల్లో ఉన్న పేదల ఉసురు తీసుకుంటోందని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ విమర్శించారు. తెనాలి టీడీపీ కార్యాలయంలో మాజీ జడ్పీటీసీ అన్నాబత్తుని జయలక్ష్మి, పార్టీ నేతలతో కలిసి నిరసన దీక్ష చేపట్టారు. 


రాష్ట్రంలో ప్రజలకు పెనుభారంగా మారిన కరెంటు చార్జీలను ప్రభుత్వం మాఫీచేయాలని మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌ డిమాండ్‌చేశారు. పొన్నూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నాయకులు మాదాల వెంకటేశ్వరరావు, బండ్లమూడి బాబురావు, అహ్మద్‌ ఖాన్‌, బొర్రు రామారావు, లక్ష్మీ నారాయణ చౌదరి, యరసాని శ్రీరామూర్తి తదితరులతో కలిసి నిరసన దీక్షలో పాల్గొన్నారు.


గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కుటుంబంతో కలసి గుంటూరులోని తన నివాసంలో నిరాహారదీక్ష చేశారు. ఎంపీ గల్లాజయదేవ్‌ కార్యాలయంలో పశ్చిమ ఇన్‌చార్జి కోవెలమూడి రవీంద్ర, నగర అధ్యక్షుడు డేగల ప్రభాకరరావు, రాష్ట్ర క్రిష్టియన్‌ సెల్‌ అధ్యక్షుడు మద్దిరాల మ్యానీ, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి రావిపాటి సాయి, కనపర్తి శ్రీనివాసరావు. మానం శ్రీనివాస్‌, ముత్తినేని రాజేష్‌, గోళ్ల ప్రభాకర్‌రావులు నిరసన ప్రదర్శన చేశారు. గుంటూరు గుజ్జనగుండ్ల విద్యుత్‌ కార్యాలయం ఎదుట మాజీ కార్పొరేటర్‌ వేములపల్లి శ్రీరాంప్రసాద్‌ నేతృత్వంలో నిరసనప్రదర్శన నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి నసీర్‌ ఆహ్మద్‌ తన నివాసంలో నిరాహరదీక్ష చేపట్టారు. తెలుగుమహిళ జిల్లా అధ్యక్షురాలు పోతురాజు ఉమాదేవి నేతృత్వంలో మహిళానేతలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. 


ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ బిల్లుల వల్ల ప్రజల భవిష్యత్తుకు కారుచీకట్లు కమ్మాయని టీడీపీ బాపట్ల ఇన్‌చార్జి వేగేశన నరేంద్రవర్మ పేర్కొన్నారు. పార్టీశ్రేణులతో కలిసి తన నివాసంలో నరేంద్రవర్మ దీక్ష చేపట్టారు. వేమూరులో పార్టీ సీనియర్‌ నేత జొన్నలగడ్డ విజయబాబు నేతృత్వంలో  నాయకులు నిరసన దీక్ష చేశారు.


 పెరిగిన విద్యుత్‌ చార్జీలను రద్దు చేయాలని డిమాండ్‌చేస్తూ తెలుగుదేశం నరసరావుపేట ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాల నాయకులు నరసరావుపేటలో దీక్ష నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపుమేరకు చిలకలూరిపేట నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నాయకులు ఒక్కరోజు నిరాహారదీక్షలో పాల్గొన్నారు.  పెదకూరపాడులోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ సూచనల మేరకు పార్టీ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు.


టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్మారెడ్డి చలమారెడ్డి తన నివాసంలో నిరసన వ్యక్తంచేశారు. గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సూచనల మేరకు పిడుగురాళ్ల టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు దీక్ష చేపట్టాయి. విద్యుత్‌ చార్జీలను పెంచి పేదప్రజలపై భారంమోపటం ప్రభుత్వానికి ఎంతవరకు సమంజసమని తెలుగుయువత రాష్ట్ర నాయకుడు మన్నెం శివనాగమల్లేశ్వరరావు ప్రశ్నించారు. సత్తెనపల్లిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో నిరసన దీక్షచేశారు. మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ యెలినేటి రామస్వామి, నేతలు చౌటా శ్రీనివాసరావు, పోట్ల ఆంజనేయులు, పూదోట రాజు, బి.చంద్రశేఖర్‌, సీపీఐ నేత నర్శేటి వేణుగోపాల్‌ తదితరులు మద్దతు ప్రకటించారు. డాక్టర్‌ కోడెల కార్యాలయంలో చేపట్టిన నిరసన దీక్షలో సయ్యద్‌ పెదకరిముల్లా, మస్తాన్‌వలి, రాంబోబుడే, పి.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. 


 కష్టకాలంలో విద్యుత్‌చార్జీలను పెంచడం దారుణమని మంగళగిరి టీడీపీ నేతలు గంజి చిరంజీవి, పోతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో నేతలు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం  తహసీల్దారు కార్యాలయం వద్ద నిరసన తెలిపి డీటీ మీరావలికి వినతిపత్రం అందజేశారు. టీడీపీ నేతలు నందం అబద్దయ్య, దామర్ల రాజు, గుత్తికొండ ధనుంజయరావు, ఆరుద్ర భూలక్ష్మి, మహమ్మద్‌ ఇబ్రహీం, వెలగపాటివిలియం, షేక్‌ రియాజ్‌ తదితరులు పాల్గొన్నారు. ఆంజనేయకాలనీలో టీడీపీ నేత గోవాడ దుర్గారావు ఆధ్వర్యంలో స్థానిక పార్టీ శ్రేణులు, మహిళలు నిరసన దీక్షచేశారు. టీడీపీ నేత పోలవరపు హరిబాబు తన నివాసంలో నిరసన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-05-22T09:28:27+05:30 IST