విలీన మండలాల్లో.. ఊరూరా జ్వరాలు
ABN , First Publish Date - 2022-09-03T17:46:51+05:30 IST
ఊరూరా జ్వరాలు.. డెంగీ అంటూ పరుగులు.. భద్రాచలమే దిక్కు.. ప్రైవేటు ఆస్పత్రుల్లో
డెంగీ, మలేరియా, వైరల్ ఫీవర్తో జనం విలవిల
వరద తగ్గాక విజృంభించిన సీజనల్ వ్యాధులు
సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న వైనం
ఏరియా ఆస్పత్రుల్లో ఒక్కరంటే ఒక్క వైద్యుడూ లేరు
విలీన మండలాల్లో 30 పోస్టులకు పదిమంది వైద్యులే
గతి లేక భద్రాచలం పరుగులు.. వేలకు వేలు ఖర్చులు
చింతూరు/కూనవరం, సెప్టెంబరు 2: ఊరూరా జ్వరాలు.. డెంగీ అంటూ పరుగులు.. భద్రాచలమే దిక్కు.. ప్రైవేటు ఆస్పత్రుల్లో వేలకు వేలు ఖర్చు. కొందరు కోలుకుంటుంటే మరికొందరి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇదీ విలీన మండలాల్లో తాజా పరిస్థితి.! వరద తగ్గినప్పటి నుంచి ఇక్కడ జ్వరాలు తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నాయి. కొందరికి డెంగీ, మరికొందరికి మలేరియా, వైరల్.. ఇలా ఊరూరా జ్వరాలే. వరద ప్రభావిత ప్రాంతాల సందర్శనలో భాగంగా సీఎం జగన్మోహన్రెడ్డి పర్యటించిన కుయుగూరులో పలువురు ఆస్పత్రుల పాలయ్యారు. తాజాగా అదే గ్రామానికి చెందిన కారం సంధ్య (10) అనే బాలిక జ్వరం బారినపడి మృతి చెందింది. ఇదే గ్రామంలో గత రెండు నెలల వ్యవధిలో యాసాల రాము, కారం భద్రమ్మ, సోడె క్రాంతికుమార్ జ్వరంతో మృతి చెందారు. ఇక చింతూరులో పది రోజుల క్రితం రాజు, సింధులను కూడా జ్వరమే బలితీసుకుంది. వారి మృతికి కూడా డెంగీనే కారణమని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. కారం సంధ్య మృతిపై డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో డాక్టర్ పుల్లయ్యను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా ఆ బాలిక వైరల్ ఫీవర్తో పాటు వాంతులు, విరోచనాలు, పిట్స్ వచ్చి మృతి చెందినట్లు చెప్పారు.
ఆస్పత్రుల్లో వైద్యులేరీ...?
విలీన మండలాల్లో వైద్యులు, మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. అయినా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. చింతూరు ఏరియా ఆస్పత్రిలో ఐదుగురు వైద్యులు ఉండాల్సి ఉండగా ఒక్కరూ లేరు. కూనవరం సీహెచ్సీ (కమ్యూనిటీ హెల్త్ సెంటరు)లో ఐదుగురు వైద్యులకు డెంటల్ డాక్టర్ మాత్రమే ఉన్నారు. చింతూరు, కూనవరం ఆస్పత్రులకు ఆయనే దిక్కు. విలీన మండలాల్లో మొత్తం తొమ్మిది ప్రాథమిక వైద్యశాలలు, ఒక ఏరియా ఆస్పత్రి, ఒక సీహెచ్సీ ఉండగా ప్రత్యేక నిపుణులు కాకుండా 30 మంది వైద్యులు ఉండాల్సి ఉంది. కానీ పది మందే ఉన్నారు. ఇక చింతూరు, కూనవరం ప్రధాన ఆస్పత్రులకు రాజమండ్రి నుంచి ప్రతి మూడు రోజులకు ఒక వైద్యుడు డిప్యుటేషన్ పద్ధతిపై వచ్చి సేవలందిస్తున్నారు. రూ.కోట్లు ఖర్చు చేసి ఆస్పత్రులు నిర్మించినప్పటికీ వైద్యులు లేకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. వరద తగ్గాక పారిశుధ్య పనులు నామమాత్రంగానే చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో దోమల ఉధృతి రోజురోజుకూ పెరిగి ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు.
ఒకే గ్రామంలో 17 మందికి డెంగీ
అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలో డెంగీ విజృంభిస్తోంది. పోలిపాక గ్రామంలో 17 మంది డెంగీ బారినపడడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వారిలో సకినాల వీరబాబు గురువారం మృతిచెందాడు. వీరబాబు డెంగీ లక్షణాలతో బుధవారం కోతులగుట్ట ఆస్పత్రికి వెళ్లాడు. అనంతరం బంధువుల ఊరు టేకులబోరుకు వచ్చి గురువారం అకస్మాత్తుగా మృతిచెందాడు. మరో వైపు టేకుబాక సర్పంచ్ రాణి సైతం డెంగీతో అస్వస్థతకు గురయ్యారు. ఆమెను భద్రాచలం ఆస్పత్రికి తరలించారు.