మా గోడు పట్టించుకోరు
ABN , First Publish Date - 2022-07-07T06:03:22+05:30 IST
పట్టాదార్ పాస్ పుస్తకం ఉండి వెబ్ల్యాండ్లో పేరు నమోదు కోసం ఏడాదిగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకుండా
రైతు, నివేశన స్థల లబ్ధిదారుల ఫిర్యాదు
కలెక్టర్ దిల్లీరావు ప్రశ్నించినా మౌనంగా తహసీల్దార్
కంచికచర్ల రూరల్, జూలై 6: పట్టాదార్ పాస్ పుస్తకం ఉండి వెబ్ల్యాండ్లో పేరు నమోదు కోసం ఏడాదిగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకుండా ఇబ్బందులు పెడుతున్నా రని వేములపల్లి గ్రామానికి చెందిన రైతు కలెక్టర్ దిల్లీరావుకు తన ఆవేదనను వ్యక్తంచేశారు. జగనన్న నివేశ స్థలాల మంజూరు జాబితాలో పేరున్నా పట్టా ఇవ్వకుండా తహసీల్దార్ ఇబ్బంది పెడుతున్నారని పరిటాలకు చెందిన లబ్ధిదారుడు కలెక్టర్ దృషికి తీసుకెళ్లాడు. మండలంలో బుధవారం పర్యటించిన ఆయనకు రైతులు, జగనన్న నివేశ స్థలం మంజూరైన లబ్దిదారులు తహసీల్దార్పై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వీటిపై స్పందించిన కలెక్టర్ ఇటువంటి ఫిర్యాదులు వస్తే సహించేది లేదన్నారు. పట్టాదార్ పాస్పుస్తకం ఉన్నా వెబ్ల్యాండ్లో ఎందుకు పేరు నమోదు చేయటం లేదని ప్రశ్నించగా తహసీల్దార్ నుంచి ఎటువంటి సమాధానం లేదు. ఇసుక అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాలకు జరిమానాలు విదించకుండా వదులుతున్నారని మీడియా ప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అలా చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ ఢిల్లీరావు తహీల్దార్ రాజకుమారిని హెచ్చరించారు. అంతే కాకుండా జగనన్న గృహ నిర్మాణాలకు సంబంధిత ప్రాంతాల్లో గుర్తించిన ప్రదేశాల నుంచి ఇసుక తోలుకునేందుకు కూపన్లు అందించాలని సూచించారు. ఫిర్యాదులు అందుతున్నాయంటే పని తీరులో లోపం ఉందని దీనిని సరి చేసుకోవాలని తహసీల్దార్కు సూచించారు. అనంతరం తహసీ ల్దార్ కార్యాలయం నుంచే జిల్లాలోని అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజకుమారి, ఎంపీడీవో శిల్ప, అధికారులు పాల్గొన్నారు.
నాడు-నేడు పనులు త్వరగా పూర్తి చేయాలి..
ప్రభుత్వ పాఠశాలల్లో రెండో విడత నాడు - నేడు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ దిల్లీరావు ఆదేశించారు. కంచికచర్ల జడ్పీ పాఠశాలరను బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో అదనపు గదుల కోసం రూ.84 లక్షలు మంజూరు కాగా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు శంకుస్థాపన చేశారు. నేటికీ పనులు ఎందుకు ప్రారంభం కాలేదని అధికారులను ప్రశ్నించారు. గదులు ఎక్కడ నిర్మించాలో అధికారులు నిర్దారణ కాకపోవటంతో వారి పని తీరుపై అసహనం వ్యక్తం చేశారు. భవన నిర్మాణంలో సందిగ్దముంటే తమకు నివేదిక ఎందుకు పంపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ స్వయంగా పరిశీలించి ఖాళీ ప్రదేశంలో గదులు నిర్మించాలని ఆదేశించారు.