మా గ్రామాన్ని దత్తత తీసుకోవాలి
ABN , First Publish Date - 2022-08-17T05:53:16+05:30 IST
మా గ్రామాన్ని దత్తత తీసుకోవాలి
- సీఎంను కోరిన చీలాపూర్ గ్రామస్తులు
పూడూర్, ఆగస్టు 16: తమ గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకోవాలని, ఇప్పటివరకు ఐదుగురు ఎమ్మెల్యేలు మారినా గ్రామ రూపురేఖలు మాత్రం మారలేదని మండల పరిధిలోని చీలాపూర్ గ్రామస్తులు కోరారు. ఈమేరకు మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన సీఎం కేసీఆర్ బహిరంగ సభకు వెళ్లి తమ సమస్యలు విన్నవిద్దామంటే ఆంక్షలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు సర్పంచ్ రాములు, రామకృష్ణ తదితరులు స్థానిక విలేకరులతో వారు మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు గడుస్తున్నా తమ గ్రామ రూపురేఖలు మారకపోవడం దురదృష్టకరమన్నారు. గ్రామంలోని భూములు రెవెన్యూ రికార్డుల్లో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, ఇప్పటివరకూ పొలాల సరిహద్దులు, నక్ష తదితర వాటికి మోక్షం లభించలేదన్నారు. అవసరానికి భూములను అమ్ముకుందామన్నా అధికారులు సర్వే చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఐదుగురు ఎమ్మెల్యేలు మారినా... గ్రామ రూపురేఖలు మాత్రం మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని గతంలో పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించినట్లు తెలిపారు. ఇప్పటికైనా సీఎం గ్రామాన్ని దత్తత తీసుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామస్తులు సర్పంచ్ రాములు, రామకృష్ణ, రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.