భరతమాత రక్షణ కవచాలు మన జవాన్లు: మోదీ

ABN , First Publish Date - 2021-11-04T20:35:00+05:30 IST

దేశ సరిహద్దులను నిరంతరం కాపాడుతున్న భారత జవాన్లపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల..

భరతమాత రక్షణ కవచాలు మన జవాన్లు: మోదీ

నౌషెరా: దేశ సరిహద్దులను నిరంతరం కాపాడుతున్న భారత జవాన్లపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. మాతృభూమి రక్షణ కవచాలు మన వీర జవాన్లని అభినందించారు. భారత సైనికులు కంటికి రెప్ప వేయకుండా దేశాన్ని కాపాడుతున్నందువల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారని అన్నారు. జమ్మూకశ్మర్‌లోని రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్‌లో సైనికులను ఉద్దేశించి ప్రధాని గురువారంనాడు మాట్లాడుతూ, నిరంతరం సరిహద్దులను కాపాడుతున్నసైనికులతో ఏటా తాను దీపావళి జరుపుకొంటున్నట్టు చెప్పారు. '' కోట్లాది మంది దేశ ప్రజల ఆశీస్సులు నా వెంట తీసుకుని ఇక్కడకు వచ్చాను'' అని సైనికులను ప్రధాని ఉత్సాహపరిచారు.


ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గురవారం ఉదయం జమ్మూ వచ్చారు. అక్కడి నుంచి రాజౌరీ జిల్లా నౌషెరా సరిహద్దు నియంత్రణ రేఖ వద్దకు వచ్చారు. మోదీ ఆర్మీ దుస్తులు ధరించి, తలపై టోపి పెట్టుకొని ఆర్మీ శిబిరాలను సందర్శించారు. జవాన్లతో కలిసి ''భారత్ మాతా కీ జై'' అంటూ ప్రధాని గొంతు కలిపారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, సర్జికల్ దాడుల్లో నౌషెరా సెక్టార్ బ్రిగేడ్ పోషించిన కీలక పాత్రను ప్రధాని ఈ సందర్భంగా ప్రశంసించారు. తీవ్రవాదం విస్తరణకు ఎన్నో ప్రయత్నాలు ఇక్కడ జరిగాయని, కానీ , సర్జికల్ దాడులతో బలగాలు గట్టి సమాధానం ఇచ్చాయని అన్నారు. మారుతున్న ప్రపంచం, యుద్ధ పద్ధతులకు అనుగుణంగా మిలటరీ సామర్థ్యాన్ని భారత్ పెంచుకుంటూ వెళ్లడం తప్పనిసరని అన్నారు. గతంలో రక్షణరంగ కోసం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడాల్సి వచ్చేదని, కానీ తమ ప్రభుత్వం దేశీయంగా సామర్థ్యం పెంచుకునే ప్రయత్నాలను మెరుగుపరిచిందని చెప్పారు. ప్రధానిగా తాను ఇక్కడకు రాలేదని, వీరజవాన్ల కుటుంబంలో ఒక సభ్యుడిగా కలిసి దీపావళి వేడుకలో పాల్గొనేందుకు వచ్చానని మోదీ చెప్పడంతో సైనికుల్లో నూతనోత్సాహం తొణికిసలాడింది.



Updated Date - 2021-11-04T20:35:00+05:30 IST