పేదలకు ప్రయోజనం కల్పించేందుకే ఓటీఎస్ పథకం: బొత్స
ABN , First Publish Date - 2021-12-01T23:11:33+05:30 IST
పేదలకు ప్రయోజనం కల్పించేందుకే ఓటీఎస్ పథకమని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
అమరావతి: పేదలకు ప్రయోజనం కల్పించేందుకే ఓటీఎస్ పథకమని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లబ్ధిదారులకు గృహహక్కు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇది బలవంతపు పథకం కాదని, దీనిపై కావాలనే టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని తప్పుబట్టారు. పేదలపై టీడీపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పేదలంటే టీడీపీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ఎందుకంత కక్ష? అని బొత్స ప్రశ్నించారు. పేదలకు న్యాయం చేయాలని ప్రభుత్వం చూస్తుంటే.. టీడీపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఓటీఎస్పై విమర్శలు చేసినవారి వెనుక టీడీపీ వాళ్లే ఉన్నారని, ఇదంతా చంద్రబాబు ఆడిస్తున్న నాటకమన్నారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు.