ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ కన్నుమూత

ABN , First Publish Date - 2021-09-14T09:16:33+05:30 IST

కాంగ్రెస్‌ వృద్ధ నేత, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌(80) సోమవారం కర్ణాటకలోని మంగళూరులో కన్నుమూశారు.

ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ కన్నుమూత

బెంగళూరు, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ వృద్ధ నేత, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌(80) సోమవారం కర్ణాటకలోని మంగళూరులో కన్నుమూశారు. జూలైలో ఇంట్లో యోగా చేస్తూ కింద పడ గా ఆయన తలలో రక్తనాళాలు గడ్డకట్టడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. మంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కోలుకుంటున్న దశలో ఒక్కసారిగా పరిస్థితి విషమించి కన్నుమూశారు. రాజీవ్‌గాంధీకి అత్యంత సన్నిహితుల్లో ఒకడైన ఫెర్నాండెజ్‌ గాంధీల కుటుంబానికి విధేయునిగా పేరుపడ్డారు. ఆయన ఉడుపి జిల్లా ఉద్యావరలో 1941 మార్చి 27న కేథలిక్‌ కుటుంబంలో జన్మించారు. ఉడుపి కళాశాలలో చదువుతున్నప్పుడే కాంగ్రె్‌సలో చేరిన ఆయన 1972లో తొలిసారి కార్పొరేటర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1980లో తొలిసారిగా ఉడుపి లోక్‌సభ ఎన్నికలో విజయం సాధించిన ఆస్కార్‌ఫెర్నాండెజ్‌ 1984, 1989, 1991, 1996లో వరుసగా ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. 1998 నుంచి వరుసగా 4 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2022 జూన్‌ దాకా ఆయ న రాజ్యసభ హోదాకు గడువు ఉంది. కేంద్రంలో పలు మం త్రిత్వ శాఖలు నిర్వహించారు. ఫెర్నాండెజ్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఫెర్నాండెజ్‌ కుటుంబ సభ్యులను కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో పాటు పలువురు నేతలు ఫోన్‌లో పరామర్శించారు. 


మోదీ, కేసీఆర్‌ తదితరుల నివాళి..

ఫెర్నాండెజ్‌ మృతి దిగ్ర్భాంతికి గురి చేసిందని ప్రధాని మోదీ అన్నారు. పార్టీకి, తనకు మార్గదర్శకత్వం అందించిన ఆస్కార్‌ మృతి తీరని లోటు అని రాహుల్‌గాంధీ అన్నారు. కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి తదితరులు సంతాపం తెలిపారు. ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. యూపీఏ ప్రభుత్వంలో ఆయనతో కలిసి కేంద్రమంత్రిగా పని చేసే అవకాశం లభించిందని సీఎం గుర్తు చేసుకున్నారు. ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌ మృతి పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్‌ బోయిపల్లి వినోద్‌కుమార్‌ కూడా సంతాపం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-09-14T09:16:33+05:30 IST