ఆర్గనైజేషన్‌ చేతకాదు

ABN , First Publish Date - 2022-08-08T05:36:33+05:30 IST

భారతీయ జనతా పార్టీకి ఆర్గనైజేషన్‌ చేతకాదని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు గద్దే బాబూరావు వ్యాఖ్యానించారు. చీపురుపల్లిలో ఆయన విలేకరులతో ఆదివారం మాట్లాడారు.

ఆర్గనైజేషన్‌ చేతకాదు
అంబేడ్కర్‌కు నివాళులర్పిస్తున్న బీజేపీ నాయకులు, గద్దే బాబూరావు

 
సొంత పార్టీపై బీజేపీ నాయకుడు గద్దే బాబూరావు సంచలన వ్యాఖ్యలు
చీపురుపల్లి, ఆగస్టు 7:
భారతీయ జనతా పార్టీకి ఆర్గనైజేషన్‌ చేతకాదని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు గద్దే బాబూరావు వ్యాఖ్యానించారు. చీపురుపల్లిలో ఆయన విలేకరులతో ఆదివారం మాట్లాడారు. జిల్లాలో సాగుతున్న బీజేపీ యువ సంఘర్షణ యాత్ర రూట్‌మ్యాప్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యాత్ర చేస్తున్న నాయకులకు కనీస అవగాహన లేదని, బొబ్బిలి నుంచి రాజాం మీదుగా చీపురుపల్లి రావాల్సి ఉండగా ఇటు రాకుండా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల వెళ్లిపోవడం సరికాదని అన్నారు. యాత్ర బృందం చీపురుపల్లి వస్తుందని తాము ఎదురుచూశామని నిరాశ వ్యక్తం చేశారు. దీనివల్ల పార్టీ వర్గాల్లో గందరగోళం నెలకొంటుందని, యాత్ర కోసం లక్షలాది రూపాయలు వెచ్చించిన పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని గాని, తాను గాని ఇటువంటి సందర్భాల్లో ఎంత ఇబ్బంది పడతామో పార్టీ గమనించాలని ఆయన కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ యువతను మోసం చేసినందుకు నిరసనగా తమ పార్టీ ఆధ్వర్యంలో యువ సంఘర్షణ యాత్ర చేపట్టామన్నారు. అంతకుముందు పట్టణంలోని లావేరు రోడ్డులో ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


Updated Date - 2022-08-08T05:36:33+05:30 IST