పేద కుటుంబం.. పెద్ద మనసు!

ABN , First Publish Date - 2021-03-02T09:28:19+05:30 IST

పేద కుటుంబం పెద్ద మనసు చాటుకుంది. కుటుంబ యజమానికి బ్రెయిన్‌డెడ్‌ అయితే ఆయన అవయవాలు మరొకరికి దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచింది.

పేద కుటుంబం.. పెద్ద మనసు!

బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తి అవయవాలు దానం


పంగులూరు, మార్చి 1: పేద కుటుంబం పెద్ద మనసు చాటుకుంది. కుటుంబ యజమానికి బ్రెయిన్‌డెడ్‌ అయితే ఆయన అవయవాలు మరొకరికి దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం చందలూరు గ్రామానికి చెందిన నూతలపాటి వెంకటేశ్వర్లు టైర్ల పంక్చర్‌ షాపు నిర్వహిస్తున్నాడు. గతనెల 15న ఆయన షాపు వద్ద బైక్‌కు పంక్చర్‌ వేసి గాలి కొడుతుండగా అది పేలింది. రిమ్ము ఎగిరిపడి తలకు బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావమై వెంకటేశ్వర్లు అక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు ఒంగోలులోని ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు.


13 రోజులపాటు మృత్యువుతో పోరాడిన వెంకటేశ్వర్లుకు బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు వైద్యులు సోమవారం నిర్ధారించారు. జీవన్‌ధాన్‌ సంస్థ ప్రతినిధులు వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులను సంప్రదించి అవయవదానం చేయాలని కోరగా వారు పెద్ద మనసుతో అంగీకరించారు. వెంకటేశ్వర్లు గుండె, ఊపిరితిత్తులను చెన్నైలోని ప్రైవేటు వైద్యశాలకు.. కాలేయం, మూత్రపిండాలను విజయవాడ ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2021-03-02T09:28:19+05:30 IST