త్వరలో ఓపీఎస్-శశికళ భేటీ?
ABN , First Publish Date - 2022-07-14T18:13:43+05:30 IST
అన్నాడీఎంకే బహిష్కృతనేతలైన వీకే శశికళ, ఒ.పన్నీర్సెల్వం త్వరలో భేటీ కానున్నారా?.. ఈ ఇద్దరినీ విందుకు రావాలని దివంగత ముఖ్యమంత్రి
విందుకు ఆహ్వానించిన దీప..!
పోయెస్ గార్డెన్లోనే సమావేశం ?
చెన్నై/అడయార్: అన్నాడీఎంకే బహిష్కృతనేతలైన వీకే శశికళ, ఒ.పన్నీర్సెల్వం త్వరలో భేటీ కానున్నారా?.. ఈ ఇద్దరినీ విందుకు రావాలని దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప ఆహ్వానించారా?.. అవుననే అంటున్నాయి విశ్వసనీయవర్గాలు. ఆ మేరకు రెండుమూడు రోజుల్లో ఈ ముగ్గురూ ప్రస్తుతం దీప సొంతమైన పోయె్సగార్డెన్లోని జయ నివాసంలో కలవనున్నారు. ఇటీవల అన్నాడీఎంకేలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి, పార్టీ సమన్వయకర్త పదవి నుంచి ఓపీఎ్సను బహిష్కరిస్తూ అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, శాసనసభ ఉప నేత పదవి నుంచి పన్నీర్సెల్వంను తొలగించేందుకు ఈపీఎస్ సిద్ధమయ్యారు. ఓపీఎస్తో కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండగా, మిగిలిన వారంతా ఈపీఎస్ వెంటవున్నారు. దీంతో పార్టీని సొంతం చేసుకున్నందుకు ఒకవైపు న్యాయపోరాటం చేస్తూనే, మరోవైపు ప్రత్యామ్నాయ మార్గాలపై ఓపీఎస్ ముమ్మరంగా అన్వేషిస్తున్నారు. నిజానికి శశికళతో కలిసి పని చేసేందుకు ఓపీఎస్ చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు.
అయితే శశికళ పార్టీలోకి రావడం ఏమాత్రం ఇష్టంలేని ఈపీఎస్.. ఆయన ప్రయత్నాలను అడ్డుకున్నారు. శశికళ అన్నాడీఎంకేలో చేరితే ఆ పార్టీ మరింత దృఢమవుతుందని బీజేపీలోని కొంతమంది రాష్ట్ర ముఖ్యనేతలు గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ ఢిల్లీ పెద్దల వద్ద చక్రం తప్పిన ఈపీఎస్ తను అనుకున్నది సాధించుకున్నారు. ‘శశికళ చేరిక’ ఊసే లేకుండా చేసేశారు. దీంతో అన్నాడీఎంకే నుంచి బహిష్కృతులైన ఆ ఇద్దరు నేతలు కలిసి పని చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జయ మేనకోడలు దీప ఓపీఎ్సకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి విందుకు ఆహ్వానించినట్లు సమాచారం.
పోయెస్ గార్డెన్లోని జయ నివాసంలో జరిగే ఈ విందుకు శశికళ కూడా వస్తారనిచెప్పినట్టు తెలిసింది. ఇందుకు ఓపీఎస్ కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు. నిజానికి గత ఏడాది ఓపీఎస్ సతీమణి మరణించినప్పుడు శశికళ వెళ్లి పరామర్శించారు. ఆమెను చూడగానే ఓపీఎస్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య సఖ్యత పెరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ ఆ ఇద్దరు నేతలు భేటీ కానున్నట్లు సమాచారం. ఈ భేటీ అన్నాడీఎంకేలో ఎలాంటి మార్పులు తెస్తుందో, రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తుందో వేచి చూడాల్సివుంది.