Meeting: ఓపీఎస్తో ఈపీఎస్ మద్దతుదారుల భేటీ
ABN , First Publish Date - 2022-08-05T13:10:36+05:30 IST
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)కి సేలం, నామక్కల్ జిల్లాలకు చెందిన ఆయన అనుయాయులు
చెన్నై, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)కి సేలం, నామక్కల్ జిల్లాలకు చెందిన ఆయన అనుయాయులు షాకిచ్చారు. తమ నేతను కాదని అన్నాడీఎంకే బహిష్కృత నేత ఒ.పన్నీర్సెల్వం (O. Panneerselvam)తో భేటీ అయ్యారు. గురువారం పెరియకుళంలోని ఓపీఎస్ ఫామ్హౌస్(Farmhouse)కు వెళ్లిన ఈపీఎస్ సొంతజిల్లా సేలంకు చెందిన బాలకృష్ణన్, మరికొంతమంది స్థానిక నాయకులు, నామక్కల్ జిల్లాకు చెందిన పళనిసామి, సేలం రవి తదితరులు ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయి ఓపీఎస్కే మద్దతు ప్రకటించారు. అనంతరం వారంతా మీడియాతో మాట్లాడుతూ.. అన్నాడీఎంకేలో పార్టీ శ్రేణులను కలుపుకునిపోయే విధంగా నాయకత్వం ఉండేదని, ప్రస్తుతం పార్టీ కార్యకర్తలను పట్టించుకోని నాయకులే పెత్తనం చెలాయిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మళ్ళీ అన్నాడీఎంకే(AIADMK) అధికారంలోకి రావాలంటే నాయకులంతా కలిసి ఉండాలని చెప్పారు. ప్రస్తుతం ఈపీఎస్(EPS) పార్టీ శ్రేణులను పట్టించుకోవడం లేదని, పలు జిల్లాల్లో ఆయన్ని స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఇదిలా వుండగా వీరంతా ద్వితీయ శ్రేణి నాయకులే కావడంతో తమకొచ్చిన నష్టమేమీ లేదని ఈపీఎస్ వర్గీయులు ప్రకటించారు.