రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌పై విపక్షాల అవిశ్వాస తీర్మానం

ABN , First Publish Date - 2020-09-20T23:16:14+05:30 IST

రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ హరివంశ్ నారాయణ్ సింగ్‌పై విపక్ష పార్టీలు ఆదివారంనాడు అవిశ్వాస తీర్మానం..

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌పై విపక్షాల అవిశ్వాస తీర్మానం

న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ హరివంశ్ నారాయణ్ సింగ్‌పై విపక్ష పార్టీలు ఆదివారంనాడు అవిశ్వాస తీర్మానం (నో కాన్ఫిడెన్స్ మోషన్) ప్రవేశపెట్టాయి. సభలో ప్రవేశపెట్టిన రెండు రైతు బిల్లులపై చర్చ సందర్భంగా సభాసమయం పూర్తయినందున వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సమాధానాన్ని సోమవారానికి వాయిదా వేయాలని విపక్షాలు చేసిన విజ్ఞప్తిని డిప్యూటీ స్పీకర్ తోసిపుచ్చారు. దీనిపై విపక్ష పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ డిప్యూటీ స్పీకర్‌పై 'నో కాన్ఫిడెన్స్ మోషన్' ప్రవేశపెట్టారు.


నో కాన్ఫిడెన్స్ మోషన్‌పై సుమారు 100 మంది సభ్యులు (ఎంపీలు) సంతకాలు చేశారు. సెక్రటరీ జనరల్ హాజరుకాకపోవడంతో ఈ నోటీసును పార్లమెంటు కార్యాలయంలో అందజేశారు.


దీనికి ముందు, విపక్ష పార్టీల నిరసనలు, ఆందోళన మధ్య వ్యవసాయ బిల్లులను రాజ్యసభ ఆమోదించింది. వ్యవసాయ బిల్లు ప్రతుల్ని విపక్ష సభ్యులు చింపేశారు. ఈ బిల్లుతో రైతులకు తీరని నష్టమంటూ నినాదాలతో హోరెత్తించారు. సెలక్ట్ కమిటీకి పంపాలని కొందరు, బిల్లులను ఉపసంహరించాలని మరికొందరు డిమాండ్‌ చేయడంతో పాటు, డిప్యూటీ చైర్మన్‌ మైక్‌ను కూడా లాక్కునేందుకు యత్నించారు. ఈ గందరగోళం మధ్యే బిల్లులకు ఆమోదం లభించింది. అనంతరం రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది.

Updated Date - 2020-09-20T23:16:14+05:30 IST