ఉక్రెయిన్ సంక్షోభంపైనా విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయి: మోదీ

ABN , First Publish Date - 2022-03-05T22:00:27+05:30 IST

ఉక్రెయిన్ సంక్షోభం పైనా విపక్షాలు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ప్రధాని..

ఉక్రెయిన్ సంక్షోభంపైనా విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయి: మోదీ

లక్నో: ఉక్రెయిన్ సంక్షోభం పైనా విపక్షాలు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజల బాధలపై వారికి ఎలాంటి పట్టింపూ లేదని విమర్శించారు. సుదీర్ఘంగా సాగిన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఘట్టంలో చివరి విడత పోలింగ్ ఈనెల 7న జరుగనుండటంతో ప్రధాని తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో శనివారంనాడు విస్తృత ప్రచారం సాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఖజురి గ్రామంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో మోదీ మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ అనుకూల పవానాలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ప్రజలు ఉన్నారని తెలిపారు. తన పట్ల వ్యతిరేకత కారణాంగానే కుటుంబ పాలకులు "వోకల్ ఫర్ లోకల్'', స్వచ్ఛ భారత్ అభియాన్‌పై ఛలోక్తులు వేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కుపెడుతూ, ఖాదీ వాడకాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ వచ్చిన ఆ పార్టీ ఇప్పుడు ఆ పేరు ఎత్తడానికి కూడా వెనుకాడుతోందని అన్నారు. ఖాదీ, యోగాను అంతర్జాతీయ బ్రాండ్‌లుగా తీర్చిదిద్దిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు. ఈ నెల 7న చివరి విడత పోలింగ్‌ జరగనున్న ప్రాంతాల్లో వారణాసి కూడా ఉంది. 10న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2022-03-05T22:00:27+05:30 IST