పోకిరీల ఆట కట్టించేందుకు యోగి ‘ఆపరేషన్ దురాచారి’!
ABN , First Publish Date - 2020-09-25T16:32:45+05:30 IST
మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న మానవ మృగాలు, ఈవ్ టీజర్లు, పోకిరీలకు చెక్...
లక్నో: మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న మానవ మృగాలు, ఈవ్ టీజర్లు, పోకిరీలకు చెక్ పెట్టేందుకు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వినూత్న చర్యలకు ఉపక్రమించారు. అలాంటి వారిని బజారుకీడ్చి, అవమానించే విధంగా ‘ఆపరేషన్ దురాచారి’ పేరుతో సరికొత్త కార్యక్రమం ప్రారంభించారు. మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడుతున్న వారి ఫోటోలతో పోస్టర్లు పెట్టాలంటూ పోలీస్ శాఖను సీఎం యోగి ఆదేశించారు. ఆడపిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తించేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని ఆయన పోలీస్ శాఖకు స్పష్టం చేశారు. యాంటి రోమియో స్క్వాడ్లను కూడా మళ్లీ రంగంలోకి దించాలని ఆయన సూచించినట్టు సమాచారం. కాగా ఇప్పటికే లక్నో రేంజ్ ఐజీ లక్ష్మీ సింగ్ లక్నో, పరిసర ప్రాంతాల్లో ‘‘ఆపరేషన్ శక్తి’’ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ఆపరేషన్ కింద ఇప్పటికే పోలీసులు 2200 మంది నేరగాళ్లపై చెక్ పెట్టగా.. మొత్తం 822 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.