ఓపెన్ మార్కెట్ నుంచి 2 వేల కోట్ల రుణం!
ABN , First Publish Date - 2020-04-10T06:38:36+05:30 IST
ఓపెన్ మార్కెట్ నుంచి ఈ నెలలో రూ.2 వేల కోట్ల రుణం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేందుకు తీసుకునే...
ఇబ్బందుల నుంచి బయట పడేందుకు ప్రభుత్వ నిర్ణయం
హైదరాబాద్, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): ఓపెన్ మార్కెట్ నుంచి ఈ నెలలో రూ.2 వేల కోట్ల రుణం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేందుకు తీసుకునే ఈ రుణాన్ని 8-10 ఏళ్లలో చెల్లించనుంది. నెలకు రూ.10-12 వేల కోట్ల ఆదాయం పొందే రాష్ట్ర ప్రభుత్వానికి కరోనా లాక్డౌన్తో భారీ గండి పడిన విషయం తెలిసిందే. ప్రస్తుత క్లిష్ట పరిస్థితిలో నెలకు రూ.50-100 కోట్ల ఆదాయం మాత్రమే రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కరోనా ప్రభావం దేశవ్యాప్తంగా ఉన్నందున కేంద్రం నుంచి కూడా ఆర్థిక సాయం అందే పరిస్థితి లేదు. వచ్చే 9 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.15,051 కోట్ల రుణం తీసుకునేందుకు ఆర్బీఐ ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ఆ రుణాన్ని ఒకేసారి తీసుకునేందుకు ఆర్బీఐ నిబంధనలు అడ్డొస్తాయి. అందుకే ఈ నెలలో రూ.2వేల కోట్ల రుణం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం 13న ప్రభుత్వ బాండ్లను వేలం వేస్తారు. మరోవైపు కేంద్రంతో మాట్లాడి ఆర్బీఐ పరిమితిని ఎత్తేయించడం ద్వారా ఒకేసారి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.