పోలీస్ బ్యారక్స్ మైదానంలో ఓపెన్ హౌస్
ABN , First Publish Date - 2021-10-29T04:39:54+05:30 IST
పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా నగర పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పోలీస్ బ్యారక్స్ మైదానంలో గురువారం ఓపెన్ హౌస్ నిర్వహించారు.
విద్యార్థులకు ఆయుధాలపై అవగాహన కల్పించిన పోలీసులు
పలు అంశాలు స్వయంగా వివరించిన నగర కమిషనర్ మనీష్కుమార్ సిన్హా
విశాఖపట్నం, అక్టోబరు 28: పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా నగర పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పోలీస్ బ్యారక్స్ మైదానంలో గురువారం ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు వినియోగించే ఆయుధాలు ప్రదర్శించి విద్యార్థులకు వాటిపై అవగాహన కల్పించారు. అలాగే బాంబులు నిర్వీర్యం చేసే పరికరాలు, డాగ్ స్వ్క్యాడ్ ప్రాముఖ్యత గురించి తెలిపారు.
అల్లర్లు, దొమ్మీలు జరిగేటప్పుడు నిరసనకారులను చెదరగొట్టేందుకు ఉపయోగించే వజ్ర వాహనం, బాష్పవాయువు ప్రయోగాలను ప్రత్యక్షంగా ప్రదర్శించి చూపారు. ఓపెన్ హౌస్లో పాల్గొన్న కమిషనర్ మనీష్కుమార్ సిన్హా విద్యార్థులతో మమేకమై పలు అంశాలు వారికి తెలిపారు. వారి సందేహాలు నివృత్తి చేశారు. అనంతరం విద్యార్థులు, సీపీ పరస్పరం గౌరవ వంతనం చేసుకున్నారు. కార్యక్రమంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.