117 మంది విద్యార్థులకు ఒకే ఒక్క ఉపాధ్యాయుడు!

ABN , First Publish Date - 2021-10-25T05:18:09+05:30 IST

ఏడు తరగతులు.. 117మంది విద్యార్థులు.. కానీ ఒకే ఒక్క ఉపాధ్యాయుడు..! ఇదీ.. భీంపూర్‌ మండలం అంతర్‌గాం గ్రామ ప్రాథమికోన్నత పాఠశాల దుస్థితి.

117 మంది విద్యార్థులకు ఒకే ఒక్క ఉపాధ్యాయుడు!
అంతర్‌గాం పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న హెచ్‌ఎం శ్రీకాంత్‌

అంతర్‌గాం ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకే ఒక్క ఉపాధ్యాయుడు

ఏడు తరగతులు, 117 మంది విద్యార్థులు

కరోనా నేపథ్యంలో పాఠశాలకు పెరిగిన విద్యార్థుల సంఖ్య

భీంపూర్‌, అక్టోబరు 24 : ఏడు తరగతులు.. 117మంది విద్యార్థులు.. కానీ ఒకే ఒక్క ఉపాధ్యాయుడు..! ఇదీ.. భీంపూర్‌ మండలం అంతర్‌గాం గ్రామ ప్రాథమికోన్నత పాఠశాల దుస్థితి. పాఠశాలలో ఏడో తరగతి వరకు ఉండగా.. ఏకైక ఉపాధ్యాయుడు శ్రీకాంత్‌తోనే విద్యార్థులకు బోధన కొనసాగుతోంది. కరోనా నేపథ్యంలో.. గ్రామంలోని ప్రయివేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. గతంలో 50మంది లోపే ఉన్న విద్యార్థుల సంఖ్య.. ఇప్పుడు ఏకంగా 117కు చేరింది. అయితే ఉపాధ్యాయులెవరూ లేకపోవడంతో.. బోధన అంతంత మాత్రంగానే సాగుతోంది. గతేడాది ఈ పాఠశాల నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లారు. మళ్లీ ఉపాధ్యాయులెవరూ రాకపోవడంతో.. పాఠశాలలో ఉన్న ఏకైక ఉపాధ్యాయుడు శ్రీకాంత్‌ పైనే భారం పడింది. ఈ నేపథ్యంలో అంతర్‌గాం పాఠశాలకు వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని గ్రామ సర్పంచ్‌ బక్కీ లలిత, విద్యాకమిటీ చైర్మన్‌ షేక్‌ ఖాదర్‌లు ప్రభుత్వాన్ని కోరారు. 

Updated Date - 2021-10-25T05:18:09+05:30 IST