పనిచేసేందుకు కావాల్సినంత శక్తి ఉంది: మెట్రో శ్రీధరన్

ABN , First Publish Date - 2021-03-08T02:31:44+05:30 IST

బీజేపీ మాత్రమే కేరళను రక్షించగలదని 'మెట్రో మాన్' ఇ.శ్రీధరన్..

పనిచేసేందుకు కావాల్సినంత శక్తి ఉంది: మెట్రో శ్రీధరన్

తిరువనంతపురం: బీజేపీ మాత్రమే కేరళను రక్షించగలదని 'మెట్రో మాన్' ఇ.శ్రీధరన్ అన్నారు. కేరళలోని తిరువనంతపురంలో ఆదివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో పాటు శ్రీధరన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధరన్ మాట్లాడుతూ, అవినీతి ఎల్‌డీఎఫ్, కాంగ్రెస్ నుంచి రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. కేరళను రక్షించ గలిగే శక్తి బీజేపీకి మాత్రమే ఉందన్నారు. ఈ వయస్సులోనూ తాను రాజకీయాల్లోకి రావాలనుకోవడానికి కారణాలను ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.


'ఈ వయస్సులో రాజకీయాల్లోకి రావడంపై చాలా మంది నన్ను అడుగుతున్నారు. నా సమాధానం ఒక్కటే. ఈ దేశంలోని చాలా ప్రాజెక్టులకు నేను పనిచేశాను. ఈ వయస్సులో కూడా పని చేసేందుకు తగినంత శక్తి నాకు ఉంది. నాకున్న శక్తిని కేరళ అభివృద్ధి కోసం వెచ్చించాలని అనుకుంటున్నాను. ఆ కారణంగానే బీజేపీలోకి వచ్చాను' అని శ్రీధరన్ తెలియజేశారు. కాగా, బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవికి శ్రీధరన్‌ను‌ బీజేపీ ఎంపిక చేసే అవకాశాలున్నాయి. శ్రీధరన్ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.సురేంద్రన్ రెండ్రోజుల క్రితం ప్రకటించడం వెనుక అధిష్ఠానం ఆయనకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టు చెబుతున్నారు.


పలువురు సినీ నటులు చేరిక

కాగా, అమిత్‌షా ర్యాలీలో పలువురు సినీ ప్రముఖులు బీజేపీలో చేరారు. నటుడు దేవన్, రాధ, మాజీ బ్యూరోక్రాట్ కెవీ బాలకృష్ణన్ పార్టీ కండువా కప్పుకున్నారు.

Updated Date - 2021-03-08T02:31:44+05:30 IST