బీజేపీ మాత్రమే అలా చేయగలదు : చిదంబరం

ABN , First Publish Date - 2021-11-20T21:09:38+05:30 IST

కేబినెట్ అనుమతి లేకుండా ముఖ్యమైన నిర్ణయాలు

బీజేపీ మాత్రమే అలా చేయగలదు : చిదంబరం

న్యూఢిల్లీ : కేబినెట్ అనుమతి లేకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కేవలం బీజేపీ హయాంలోనే జరుగుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ఆరోపించారు. మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం ట్వీట్ చేశారు. 


‘‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేబినెట్ సమావేశం నిర్వహించకుండా ఈ ప్రకటన చేసినట్లు మీరు గమనించారా? ముందుగా కేబినెట్ అనుమతి తీసుకోకుండా చట్టాలు చేయడం, ఉపసంహరించడం కేవలం బీజేపీ హయాంలో మాత్రమే జరుగుతుంది’’ అని చిదంబరం ట్వీట్ చేశారు. 


మోదీ శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇచ్చిన ట్వీట్లపై కూడా చిదంబరం ఘాటుగా స్పందించారు. 


మోదీ పెద్ద మనిషి తరహాలో వ్యవహరించారని అమిత్ షా అన్నారని, రైతుల పట్ల మోదీకి చాలా శ్రద్ధ ఉందని జేపీ నడ్డా అన్నారని, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని రాజ్‌నాథ్ సింగ్ అన్నారని, గత 15 నెలల్లో ఈ నేతలంతా ఏమైపోయారని, తెలివైన సలహాలు ఎందుకు ఇవ్వలేకపోయారని చిదంబరం ప్రశ్నించారు. కేబినెట్ అనుమతికి ముందే చట్టాలు చేయడం, ఉపసంహరించడం కేవలం బీజేపీ హయాంలో మాత్రమే జరుగుతుందన్నారు. 


వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చట్టాల పట్ల రైతులకు నచ్చజెప్పడంలో విఫలమయ్యామని ఆయన పేర్కొన్నారు. 


Updated Date - 2021-11-20T21:09:38+05:30 IST