ఐక్య పోరుతోనే ఎల్ఐసీని కాపాడుకోగలం
ABN , First Publish Date - 2021-11-28T04:49:48+05:30 IST
ఐక్య పోరాటంతోనే జీవిత బీమా సంస్థను కాపాడుకోగలమని బీమా కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐఐఈఏ) జాతీయ నాయకుడు కె.వేణుగోపాల్ తెలిపారు.
ఏఐఐఈఏ జాతీయ నాయకుడు కె.వేణుగోపాల్
విశాఖపట్నం, నవంబరు 27: ఐక్య పోరాటంతోనే జీవిత బీమా సంస్థను కాపాడుకోగలమని బీమా కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐఐఈఏ) జాతీయ నాయకుడు కె.వేణుగోపాల్ తెలిపారు. ఎల్ఐసీలో వాటాలా విక్రయాన్ని కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేస్తోందని, పాలసీదారుల ఆందోళను గుర్తించి కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సంతకాల ఉద్యమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
ఐసీఈయూ విశాఖపట్నం 47వ వార్షిక సర్వసభ్య సమావేశం ఎల్ఐసీ డివిజన్ ఆఫీస్లోని లలిత కళా వేదికలో శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వేణగోపాల్ మాట్లాడుతూ రెండు దశాబ్దాల నుంచి ఎల్ఐసీ దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. 99.84 శాతం క్లైయిములు పరిష్కారం వల్ల ప్రజల నమ్మకమే దీనికి కారణమని చెప్పారు. అటువంటి సంస్థ విచ్ఛిన్నానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.
1994 నుంచి కేంద్రంలోని ప్రభుత్వాల ప్రయత్నాలను అడ్డుకునేందుకు సమష్టి పోరాటం చేస్తున్నామని, ఈ స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఐసీఈయూ విశాఖ అధ్యక్షురాలు ఎం.కామేశ్వరి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు జి.కిశోర్కుమార్, ఆర్.ఠాగూర్, బి.తిరుమలరావు, వై.వెంకటరావు, కె.రవికుమార్, ఎ.రామకృష్ణ, ఎం.చంద్రశేఖర్, హరనాథకుమార్, జి.రోతురెసెల్, ఆర్.పాండురంగన్, ఉద్యోగులు పాల్గొన్నారు.