కోర్టుల్లో ఆన్లైన్ విచారణ
ABN , First Publish Date - 2020-04-07T07:26:01+05:30 IST
కరోనావైరస్ ప్రబలిన ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత అరుదుగానే గుంపులుగా ఉండే కోర్టు హాల్లో విచారణకు అనుమతించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. భౌతిక దూరం పిలుపునకు అన్ని న్యాయస్థానాలు స్పందించాలని...
- వీడియో కాన్ఫరెన్స్కు సుప్రీం చట్టబద్ధత
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: కరోనావైరస్ ప్రబలిన ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత అరుదుగానే గుంపులుగా ఉండే కోర్టు హాల్లో విచారణకు అనుమతించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. భౌతిక దూరం పిలుపునకు అన్ని న్యాయస్థానాలు స్పందించాలని, వైరస్ వ్యాప్తికి దోహదం చేసే విధానాలన్నీ మార్చుకోవాలని కింది కోర్టులకు సూచించింది. ఈ మేరకు సోమవారం వీడియో కాన్షరెన్స్ ద్వారా విచారణకు మార్గదర్శకాలను విడుదల చేసింది. న్యాయవ్యవస్థ చురుగ్గా పని చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకొనేందుకు హైకోర్టులకు అధికారాలు ఇచ్చింది.
కరోనావైరస్ తగ్గిన తర్వాత కూడా కోర్టుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించడం కొనసాగుతుందని స్పష్టం చేసింది. కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు, కక్షిదారులు హాజరవ్వాల్సిన అవసరాన్ని తగ్గించేలా హైకోర్టులు తీసుకొనే చర్యలన్నీ చట్టబద్ధమేనని ప్రకటించింది. రాజ్యాంగంలోని 142వ అధికరణం కింద ఈ ప్రకటన చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, ఎల్.నాగేశ్వర్రావులతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా అక్కడి హైకోర్టులు వీడియో కాన్ఫరెన్సింగ్ విధివిధానాలపై నిర్ణయం తీసుకోవచ్చని ప్రధాన న్యాయమూర్తి చెప్పారు.