Online రమ్మీకి పెయింటర్ బలి
ABN , First Publish Date - 2022-06-18T15:00:09+05:30 IST
ఆన్లైన్ రమ్మీలో రూ.20లక్షలు కోల్పోయిన పెయింటర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక మనలి అన్నావీధిలో నాగరాజన్ (37), వరలక్ష్మి
చెన్నై, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): ఆన్లైన్ రమ్మీలో రూ.20లక్షలు కోల్పోయిన పెయింటర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక మనలి అన్నావీధిలో నాగరాజన్ (37), వరలక్ష్మి అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు. వీరికి ఆరేళ్ళ వయస్సులో ఇద్దరు కుమారులుఉన్నారు. నాగరాజన్ పెయింటింగ్ కాంట్రాక్టర్గా ఉంటూ కార్మికులతో కలిసి పెయింటింగ్ పనులు చేసి సంపాదిస్తున్నారు. కొద్ది నెలలుగా నాగరాజన్ ఆన్లైన్ రమ్మీ ఆడుతూ వరుసగా డబ్బులు కోల్పోయాడు. ఆన్లైన్ జూదంలో పోగొట్టుకున్న డబ్బుల్ని సంపాదించాలన్న పట్టుదలతో నగలు తాకట్టు పెట్టి, స్నేహితులు, బంధువుల వద్ద అప్పుచేసి ఆన్లైన్ రమ్మీ ఆడుతూ సుమారు రూ.20లక్షల దాకా నష్టపోయాడు. దీంతో భార్యభర్తల మధ్య గొడవలు అధికమయ్యాయి. అప్పులిచ్చిన బంధువులంతా ఇంటికి వచ్చి ఇకనైనా ఆన్లైన్ రమ్మీకి బానిసకావద్దంటూ సలహా ఇచ్చారు. ఈ నేపథ్యంలో రెండు రోజులకు ముందు నాగరాజన్ తన సెల్ఫోన్ను అమ్మి, ఆ డబ్బుతో ఆన్లైన్ రమ్మీ ఆడి వాటిని కూడా కోల్పోయాడు. ఈ పరిస్థితుల్లో గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని నాగరాజన్ ఆత్మహత్య చేసుకున్నాడు. నాగరాజన్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రాసిపెట్టిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాను చేసిన అప్పులు వివరాలను రాసి, ఆన్లైన్ రమ్మీకి బానిసగామారి ఆత్మహత్య చేసుకుంటున్నానని నాగరాజన్ ఆ లేఖలో పేర్కొన్నాడు. మనలి పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.