Cabinet meeting: ఆన్‌లైన్‌ రమ్మీని నిషేధిద్దాం

ABN , First Publish Date - 2022-09-27T13:04:00+05:30 IST

వందలాదిమందిని బలిగొంటున్న ఆన్‌లైన్‌ రమ్మీ(Online Rummy)ని రాష్ట్రంలో నిషేధించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆ ఆన్‌

Cabinet meeting: ఆన్‌లైన్‌ రమ్మీని నిషేధిద్దాం

- రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రాబడదాం

- చర్చించిన మంత్రివర్గ సమావేశం  


చెన్నై, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): వందలాదిమందిని బలిగొంటున్న ఆన్‌లైన్‌ రమ్మీ(Online Rummy)ని రాష్ట్రంలో నిషేధించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆ ఆన్‌లైన్‌ క్రీడ నిషేధానికి సంబంధించిన ప్రత్యేక చట్టం అమలుపై సోమవారం భేటీ అయిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కూలంకషంగా చర్చించింది. అదే విధంగా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడుల్ని ఆకర్షించడంపైనా మంత్రులు చర్చించారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) నేతృత్వంలో సోమవారం ఉదయం సచివాయంలో భేటీ అయిన మంత్రివర్గం వివిధ అంశాలపై చర్చించింది. త్వరలో శాసనసభ సమావేశాలు ప్రారంభం కానుండటంతో ఆ సమావేశాల్లో ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధ చట్టాన్ని ఆమోదింప జేయడం, అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిటీ నివేదిక, తూత్తుకుడి కాల్పులపై జస్టిస్‌ అరుణా జగదీశన్‌ సమర్పించిన నివేదికను ప్రవేశపెట్టడం వంటి కీలకమైన అంశాలపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ తన మంత్రివర్గ సహచరుల అభిప్రాయాలు తీసుకున్నారు. శాసనసభ సమావేశాల్లో కొత్తగా ప్రవేశపెట్టాల్సిన ముసాయిదా చట్టాల గురించి కూడా ఆయా శాఖల మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.. ఇక రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను నెలకొల్పేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని, కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే సంస్థలకు మరిన్ని రాయితీలు కూడా కల్పించాలని స్టాలిన్‌ నిర్ణయించారు. పరిశ్రమల స్థాపనకు దరఖాస్తు చేసుకున్న సంస్థలకు లైసెన్సులు మంజూరు చేసే విషయంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా విదేశీ పెట్టుబడులను సమీకరించడంపై ప్రత్యేక దృష్టిసారించాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. ఇదే విధంగా కొన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పథకాల అమలులో ఏర్పడుతున్న జాప్యం పట్ల స్టాలిన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా పథకాలను అమలు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు సహా వివిధ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-27T13:04:00+05:30 IST