ప్రవాసులకు Kuwait తీపి కబురు.. తదుపరి నోటీసులు వచ్చేవరకు ఆ సేవలు యథాతథం

ABN , First Publish Date - 2021-11-23T13:59:41+05:30 IST

వివిధ కారణాలతో కువైత్ బయట ఉన్న ప్రవాసులకు తాజాగా కువైత్ సర్కార్ తీపి కబురు అందించింది.

ప్రవాసులకు Kuwait తీపి కబురు.. తదుపరి నోటీసులు వచ్చేవరకు ఆ సేవలు యథాతథం

కువైత్ సిటీ: వివిధ కారణాలతో కువైత్ బయట ఉన్న ప్రవాసులకు తాజాగా కువైత్ సర్కార్ తీపి కబురు అందించింది. ఆరు నెలలకు మించి కువైత్ వెలుపల ఉన్న ప్రవాసుల రెసిడెన్సీ పర్మిట్లను పునరుద్ధరించడం జరగదని, నేరుగా రద్దు చేయడం జరుగుతుందని ఇటీవల ఓ రూమర్ బాగా హల్‌చల్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా స్పందించిన ఆ దేశ రెసిడెన్సీ వ్యవహారాల విభాగం అలాంటిది ఏమీ లేదని స్పష్టం చేసింది. చెల్లుబాటయ్యే పాస్‌పోర్టు కలిగిన ప్రవాసులు తమ రెసిడెన్సీ పర్మిట్లను యథావిథిగా ఆన్‌లైన్‌లో రెన్యువల్ చేసుకోవచ్చని పేర్కొంది. ఆన్‌లైన్ వేదికగా వచ్చే రూమర్స్‌ను నమ్మి వలసదారులు గాబరా పడాల్సిన అవసరం లేదని తెలిపింది. తదుపరి నోటీసులు వచ్చేవరకు ఈ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండబోదని పేర్కొంది.  



ఆరు నెలలకు మించి కువైత్ బయట ఉన్న ప్రవాసుల నివాస అనుమతుల పునరుద్ధరణపై ఇప్పటికీ పాత పద్దతిని అనుసరించడం జరుగుతుందని స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు ఈ విషయంలో కొత్త చట్టాలను తీసుకురావడం కూడా కుదిరే పనికాదని అంతర్గత మంత్రిత్వశాఖ చెప్పుకొచ్చింది. ఇక కువైత్ వెలుపల ఉన్న వారిలో ఎక్కువ మంది ఆర్టికల్ 22 (ఫ్యామిలీ వీసా)ని కలిగి ఉన్నారు. అలాగే వారిలో ఎక్కువ మంది స్పాన్సర్‌ల క్రింద నమోదు చేసుకున్నవారేనని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఒకవేళ కొత్త చట్టాలను తీసుకువస్తే ఇలాంటి వారికి తగిన గడువు ఇవ్వడం జరుగుతుందని తెలిపింది. ఇదిలాఉంటే.. ప్రస్తుతం కువైత్ జారీ చేస్తున్న ఫ్యామిలీ వీసాలు వలసదారుల వర్క్ పర్మిట్‌పై 500 కువైటీ దినార్ల(సుమారు రూ.1.23లక్షలు) శాలరీ ఉండాలనే షరతును అమలు చేస్తోంది. అలాగే ప్రస్తుతం వాణిజ్య, పెట్టుబడిదారులు, కుటుంబ విజిట్ వీసాల కోసం మాత్రమే విజిట్ వీసాలు జారీ చేయబడుతున్నాయి.

Updated Date - 2021-11-23T13:59:41+05:30 IST