Online జూదాన్ని నిషేధించాల్సిందే
ABN , First Publish Date - 2022-06-11T13:08:29+05:30 IST
రాష్ట్రంలో 23 మంది ప్రాణాలు బలిగొన్న ఆన్లైన్ రమ్మీ జూదాన్ని నిషేధించాల్సిందేనని పీఎంకే అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు డా.అన్బుమణి రాందాస్
- పీఎంకే నేత అన్బుమణి రాందాస్
- చెన్నైలో పార్టీ శ్రేణులతో ధర్నా
ప్యారీస్(చెన్నై), జూన్ 10: రాష్ట్రంలో 23 మంది ప్రాణాలు బలిగొన్న ఆన్లైన్ రమ్మీ జూదాన్ని నిషేధించాల్సిందేనని పీఎంకే అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు డా.అన్బుమణి రాందాస్ డిమాండ్ చేశారు. ఆన్లైన్ జూదాన్ని నిషేధించాలని కోరుతూ శుక్రవారం స్థానిక ఎగ్మూర్లో ఉన్న రాజారత్నం స్టేడియం సమీపంలో అన్బుమణి రాందాస్ అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు జీకే మణి, రైల్వే మాజీ మంత్రి ఏకే మూర్తి, పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ధర్నాను ప్రారంభించిన సందర్భంగా అన్బుమణి మాట్లాడుతూ... ఆన్లైన్ జూదం వల్ల నగదు, నగలు, ఆస్తులను కోల్పోయిన బాధితులు సమాజంలో బతకలేక అవమానంగా భావించి ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ రాజకీయ నేత బంధువు కుమారుడు కూడా ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడని, అయినా దీనిపై ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదని ఆరోపించారు. పేద, మధ్యతరగతి, ధనవంతులు అని అన్ని వర్గాలను నష్టపరుస్తున్న ఆన్లైన్ జూదాన్ని నిషేధించని కారణంగా గత పదేళ్లలో రూ.10,500 కోట్ల ఆదాయాన్ని ఆన్లైన్ సంస్థ రాబట్టుకుందని, ఇందులో కేంద్రప్రభుత్వానికి జీఎ్సటీ పన్నుగా రూ.3 వేల కోట్లు అందిందని తెలిపారు. ఆన్లైన్ జూదాన్ని నిషేధించేందుకు రెండు వారాల పాటు నిరీక్షించకుండా రెండ్రోజుల్లో అత్యవసర చట్టాన్ని తీసుకురావాలని అన్బుమణి రాందాస్ రాష్ట్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.