ఘరానా మోసగాళ్ల అరెస్ట్
ABN , First Publish Date - 2021-04-10T21:45:42+05:30 IST
ఆన్లైన్లో పెట్టుబడుల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముగ్గురు ఘరానా మోసగాళ్లను
హైదరాబాద్: ఆన్లైన్లో పెట్టుబడుల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముగ్గురు ఘరానా మోసగాళ్లను ఎల్బీ నగర్ సీసీఏస్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అశోక్ కుమార్, కంచి సంజీవ్ కుమార్, ఆసిన్ అక్తర్ అనే ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడారన్నారు. బెంగుళూరు కేంద్రంగా నకిలీ కంపెనీల పేరుతో ఆన్లైన్లో ప్రకటనలిచ్చి అమాయక ప్రజలని మోసం చేస్తున్నారని వారు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు హాంగ్కాంగ్ దేశానికి చెందినవాడని వారు పేర్కొన్నారు.
ప్రధాన నిందితుడి సూచనల మేరకు అతని సహాయంతో ఈ ముగ్గురు నిందితులు మన దేశంలో మోసాలు చేస్తున్నారని వారు పేర్కొన్నారు. 14 నకిలీ కంపనీలను సృష్టించి వాటి పేరుతో నిందితులు మోసానికి పాల్పడ్డారని పోలీసులు తెలపారు. వీటిలో పెట్టుబడి పెట్టి మోసపోయిన బాధితుల ఫిర్యాదుతో వారిపై నిఘా పెట్టామన్నారు. నిందితుల వద్ద నుంచి 3 సీపీయూలు, 24 నకిలీ కంపనీల స్టాంప్స్, 22 మొబైల్స్ , 14 నకిలీ కంపనీల బ్యాంకు అకౌంట్స్ చెక్బుక్స్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. winbiz అనే ఆన్లైన్ యాప్ ద్వారా నగరంలోని హయత్ నగర్కి చెందిన మహిళ 20 లక్షల రూపాయలు మోసపోయిందని వారు తెలిపారు. ఆమె ఫిర్యాదుతో నిందితులను అరెస్ట్ చేశామని వారు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.