Canada లో రోడ్డు ప్రమాదం.. తెలుగు వ్యక్తి మృతి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న మరో తెలుగోడు
ABN , First Publish Date - 2022-06-19T17:56:04+05:30 IST
కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తెలుగు వ్యక్తి మృతిచెందాడు.
ఒంటారియో: కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తెలుగు వ్యక్తి మృతిచెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నెల 16న(గురువారం) తెల్లవారుజామున(స్థానిక కాలమానం ప్రకారం) ఈ ఘటన చోటు చేసుకుంది. ఒంగోలుకు చెందిన పిరకల రామకృష్ణ(42) అక్కడికక్కడే చనిపోయారు. చిత్తూరు జిల్లా భాకరాపేటకు చెందిన కాయం పురుషోత్తం రెడ్డి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 16న తెల్లవారు జామున మిత్రుడిని కలిసేందుకు రామకృష్ణ, పురుషోత్తం రెడ్డి కారులో బయలుదేరారు. ఈ క్రమంలో ఒంటారియో స్టేట్ మిసెస్ ఆగా గ్రామం హైవేపై వెనుక నుంచి వచ్చిన మరో కారు వీరి కారును ఢీకొట్టింది. దీంతో వారు ప్రయాణిస్తున్న కారు స్వల్పంగా దెబ్బతింది.
దాంతో కారును రోడ్డు పక్కన ఆపి ప్రమాదానికి కారణమైన కారు ఓనర్లతో మాట్లాడుతున్నారు. అదే సమయంలో అటు వైపుగా వచ్చిన మరోకారు వారిద్దరినీ వెనుక వైపు నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామకృష్ణ అక్కడికక్కడే చనిపోగా, పురుషోత్తం రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ప్రమాదాస్థలికి చేరుకుని గాయపడిన పురుషోత్తంను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పురుషోత్తం రెడ్డి ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఏపీ ఎన్ఆర్టీఎస్ రీజినల్ కోఆర్డినేటర్ రామకృష్ణ, ప్రొ రీజినల్ కోఆర్డినేటర్ పురుషోత్తంరెడ్డిలు కెనడాలో చాలా కాలంగా నివాసముంటున్నారు. రామకృష్ణ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు అక్కడి ప్రవాసాంధ్రులు కెనడా, ఇండియన్ ఎంబసీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ ఘటనతో రామకృష్ణ కుటుంబంలో విషాదం అలుముకుంది.