ఆస్పత్రుల్లో కొనసాగుతున్న విజిలెన్స్ తనిఖీలు
ABN , First Publish Date - 2021-05-07T06:51:28+05:30 IST
తిరుపతిలోని శ్రీహాస్పిటల్ యాజమాన్యం కొవిడ్ రోగుల నుంచి భారీగా అడ్వాన్సులు తీసుకోవడంతోపాటు వారినుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నట్లు విజిలెన్స్ డీఎస్పీ మల్లేశ్వరరెడ్డి తెలిపారు.
తిరుపతి(నేరవిభాగం), మే 6: తిరుపతిలోని శ్రీహాస్పిటల్ యాజమాన్యం కొవిడ్ రోగుల నుంచి భారీగా అడ్వాన్సులు తీసుకోవడంతోపాటు వారినుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నట్లు విజిలెన్స్ డీఎస్పీ మల్లేశ్వరరెడ్డి తెలిపారు. శ్రీ హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు హాస్పిటల్ రికార్డులను పరిశీలించారన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కొవిడ్ ఆస్పత్రిలో రోజుకు అత్యధికంగా రూ. 10,300కు మించి వసూలు చేయకూడదన్నారు. కాని శ్రీ హాస్పిటల్లో ఒక్కో రోగినుంచి రోజుకు రూ. 25,000కు పైగా వసూలు చేస్తున్నారని, వీటికి సంబంఽధించి బిల్లులు కూడా ఇవ్వడంలేదని వెల్లడైందన్నారు. కేవలం లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్న రోగులకు మాత్రమే బిల్లులు ఇస్తున్నారన్నారు. అలాగే కొవిడ్ ఆస్పత్రిలో ఏ రోగినుంచి కూడా అడ్వాన్స్గా నగదును తీసుకోరాదని, కాని ఇక్కడ సుమారు రూ. 35,000 నుంచి వీలైనంతగా వసూలు చేస్తున్నట్టు వెల్లడైందన్నారు.తనిఖీ నివేదికను విజిలెన్స్ కేంద్ర కార్యాలయానికి పంపించామని, తదుపరి ఆదేశాలు అందిన తరువాత అవసరమైతే శ్రీ ఆసుపత్రి యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు చేపడతామని డీఎస్పీ మల్లేశ్వరరెడ్డి తెలిపారు.