కొనసాగుతున్న వరహా, సర్పా నదుల ఉధృత ప్రవాహం
ABN , First Publish Date - 2022-10-08T06:33:50+05:30 IST
అల్పపీడనం కారణంగా గత మూడు రోజులుగా మండలంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నారు. ఇది చూసిన అన్నదాతల్లో ఆందోళన మొదలైంది.
మూడు రోజులుగా భారీ వర్షాలు
నాలుగు గ్రామాల్లో నీట మునిగిన వరి, పత్తి పంటలు
ఆందోళన చెందుతున్న అన్నదాతలు
కోటవురట్ల, అక్టోబరు 7 : అల్పపీడనం కారణంగా గత మూడు రోజులుగా మండలంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నారు. ఇది చూసిన అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. పలుచోట్ల వరి, పత్తి పంటలు నీట మునిగాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల వరకు విడతల వారీగా కుండపోతగా వర్షం పడింది. ఈ కారణగా మండలంలోని వరహా, సర్పా నదులు గట్లకు ఆనుకుని ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఎటుచూసినా జలమే కనిపిస్తోంది. లింగాపురం, నీలిగుంట, సన్యాసిరాజుపాలెం, కె.వెంకటాపురం గ్రామాల్లో వరి, పత్తిచేను నీటమునగ్గా, లింగాపురంలో సాగునీటి చెరువు నిండిపోవడంతో ఆ చుట్టుపక్కల పంట చేళ్లను ముంచేసింది. మరో రెండు మూడు రోజులు వాతావరణం ఇలాగే కొనసాగి పరిస్థితి ఏమిటని ఇటు అన్నదాతలు, అటు సాధారణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.