గ్రామీణంలో ఏడాది విధులు!
ABN , First Publish Date - 2021-12-02T15:06:43+05:30 IST
రాష్ట్రంలోని..
జూనియర్ వైద్యులకు ప్రభుత్వ నిబంధన
ఈ ఏడాది మెడికల్ కోర్సుల్లో చేరేవారికి వర్తింపు
ఆరోగ్యశాఖ ప్రతిపాదనలు... ప్రభుత్వం ఆమోదం
అమరావతి(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో చదువుకుంటున్న మెడికల్ విద్యార్థులంతా ఎంబీబీఎస్, లేదా పీజీ పూర్తయిన తర్వాత కచ్చితంగా ఏడాది పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేదా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో విధులు నిర్వహించాలి. అలా అయితేనే ప్రభుత్వ సర్వీస్లోకి వచ్చేందుకు అర్హత కల్పిస్తారని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సమాచారం. రూరల్ సర్వీస్ చేసిన వారి సర్టిఫికెట్లనే ఎంసీఐలో రిజిస్ట్రేషన్కు అనుమతివ్వాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. 2021-22లో మెడికల్ కోర్సుల్లో చేరిన వారికి ఈ నిబంధనలు వర్తిస్తాయి.
2015లో రద్దు
ఉమ్మడి ఏపీలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2010లో రూరల్ సర్వీస్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ఆ సమయంలో జూనియర్ వైద్యులు ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యసేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం దిగొచ్చి రూరల్ సర్వీస్ అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేసింది. విభజిత ఏపీలో 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ తిరిగి రూరల్ సర్వీ్సను రద్దు చేసింది. అయితే జగన్ ప్రభుత్వం గత ఆరునెలలుగా కసరత్తు చేసి మళ్లీ రూరల్ సర్వీస్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది.
వీటి కోసమేనా?
ప్రభుత్వం కొత్తగా వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్స్, వైఎస్సార్ రూరల్ హెల్త్ క్లినిక్స్ను ఏర్పాటు చేస్తోంది. ఇదికాకుండా కొత్త పీహెచ్సీల్లో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం కొత్తగా వైద్యులను నియమించుకునే అవకాశం లేదు. మరోవైపు ప్రభుత్వ అవసరాలకు సరిపడా వైద్యులు కూడా అందుబాటులో లేరు. దీంతో ప్రభుత్వం రూరల్ సర్వీస్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఏటా కనీసం 3వేల మంది జూనియర్ వైద్యులు అందుబాటులోకి వస్తారు. వీరిని అర్బన్, రూరల్ హెల్త్ క్లినిక్స్తో పాటు పీహెచ్సీల్లో ఉపయోగించుకోవచ్చు. ఫలితంగా వైద్యుల కొరత తీరడంతో పాటు ప్రభుత్వానికి ఆర్థికంగా మేలు జరుగుతుంది.