వన్టౌన్లో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2020-09-20T15:46:50+05:30 IST
రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, దుర్గ గుడిలో వెండి సింహాల చోరీ పట్ల బాధ్యత వహిస్తూ..
మంత్రి వెలంపల్లి ఇంటి వద్ద ధర్నాకు జనసేన యత్నం
అడ్డుకున్న పోలీసులు ఫ జనసేన-పోలీసుల మధ్య తోపులాట
వన్టౌన్(విజయవాడ): రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, దుర్గ గుడిలో వెండి సింహాల చోరీ పట్ల బాధ్యత వహిస్తూ మంత్రి వెలంపల్లి శ్రీని వాసరావు తన పదవికి రాజీనామా చేయాలని కోరుతూ శనివారం కొత్త పేటలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు మహేష్తో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ ఘటనపై మంత్రి, ఈవో స్పందించకపోతే శనివారం మంత్రి ఇంటి వద్ద ధర్నా చేపడతామని పోతిన మహేష్ 4 రోజుల క్రితం ప్రకటించారు.
దీంతో తెల్లవారు జామున కొత్తపేట సీఐ ఉమర్ ఆధ్వర్యంలో పోలీసులు మహేష్ను బయటకు వెళ్లనీయకుండా హౌస్ అరెస్టు చేశారు. అప్పటికే పెద్దసంఖ్యలో చేరుకున్న నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు, పార్టీ శ్రేణుల మధ్య తోపులాట జరగటంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. ప్రత్యేక పోలీసు దళం వచ్చాక మహేష్ను, పార్టీ నేతలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని వాహనాలు ఎక్కించి నున్న, సింగ్నగర్ పోలీసు స్టేషన్లకు తరలించారు. పోలీసులను చర్యలను ఖండిస్తూ వీర మహిళలు, కార్యకర్తలు కోమల విలాస్ సెంటర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.